– కేసీఆర్పై దాడికి కుట్ర
– బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల అక్రమ హౌస్ అరెస్టులు
– కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ఆగ్రహం
దేవరకొండ, సెప్టెంబర్ 08 : కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల తీరుపై దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అక్రమంగా హౌస్ అరెస్ట్లు చేస్తూ.. మరోవైపు ప్రతిపక్ష నేత కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వైపు దాడికి వెళ్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించాల్సిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గౌరారం వద్ద ఎందుకు కాపు కాస్తున్నారని, కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఏం పని అని ఆయన ప్రశ్నించారు. కవ్వంపల్లి సత్యనారాయణను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని నిలదీశారు. కేసీఆర్ గారిపై దాడికి కంటైనర్లలో ఎమ్మెల్యేలు, కార్యకర్తలను తరలిస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష నేత ఇంటిపై దాడికి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హింసను ప్రేరేపిస్తున్నారా అని నిలదీశారు.
ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను హౌస్ అరెస్ట్లు చేయడం, అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలను మాత్రం స్వేచ్ఛగా వదిలేయడం ఏ విధమైన ప్రజాస్వామ్యమని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల నిరసనకు ఒక న్యాయం, అధికార పార్టీకి మరో న్యాయమా అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి డైరెక్షన్లోనే కేసీఆర్ పై దాడికి కుట్ర జరుగుతోందని రమావత్ రవీంద్ర కుమార్ ఆరోపించారు. హోం శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతలను సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు. ప్రజా పాలన ముసుగులో పోలీసుల రాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం వద్ద జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతపై దాడికి కుట్ర జరుగుతున్నా ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోకపోవడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా వ్యవహరించడం మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసుల దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.