‘అలవికాని హామీలతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అనతికాలంలోనే పరిపాలనలో అట్టర్ఫ్లాప్ అయ్యింది. మూడు నెలల పరిపాలనే ఇందుకు ఉదాహరణ. ఆరు గ్యారెంటీలు అని ప్రజలను మోసం చేశారు. ఏ ఒక్క హామీ సక్కగా అమలు చేయడం లేదు. హామీలు అమలు కావాలంటే బీఆర్ఎస్ గెలవాలి. ఎంపీగా గెలిపిస్తే ప్రజా గొంతుకనవుతా. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పథకాలను అమలు చేయిస్తా.
ఇటు గల్లీలో, అటు ఢిల్లీలో ప్రజల హక్కుల కోసం నిరంతరం కొట్లాడుతా.. ఎట్టి పరిస్థితుల్లో భువనగిరి ఖిలాపై గులాబీ జెండా ఎగరేసి కేసీఆర్కు కానుకగా ఇస్తాం’ అని బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేశ్ చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో ఆదివారం నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వెల్లడించారు. ఆయన మాటల్లోనే..
ప్రజలు తొందరపాటులో ఓటేశామని గుర్తించారు. ఇప్పుడు చెయ్యి గుర్తుకు ఎందుకు ఓటేశామా అని బాధపడుతున్నారు. కాంగ్రెస్లో నిజమైన కార్యకర్తలకు లాభం జరుగడంలేదు. పారాచూట్ నేతలకే టికెట్లు దక్కుతున్నాయి. చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా పారాచూట్ నేతే. సీనియర్ నేతలు ఉన్నా ఎందుకు టికెట్ ఇవ్వలేదు. రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసిన వ్యక్తి చామల. అలాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆలోచిస్తున్నారు. కిరణ్కుమార్ రెడ్డి నాకు పోటీ కాదు.
నాకు వందల ఎకరాల భూమి ఉంది. నాకు డబ్బులు సంపాదించుకోవాలనే ఆశ, ఆలోచన లేదు. ప్రజా సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను. ఇన్నేండ్ల రాజకీయంలో చిన్న మచ్చలేని వ్యక్తిగా జీవిత ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నా. అవినీతికి ఆమడ దూరంలో ఉంటా. అందరికీ అండగా ఉంటా. ఆపదలో అన్నా.. అని వస్తే ఆదుకుంటా.. నమ్మిన సిద్ధాంతం కోసం పని చేస్తా. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నన్ను గుర్తించి భువనగిరి పార్లమెంట్ స్థానంలో పోటీకి అవకాశం కల్పించారు.
కేసీఆర్ హయాంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది. ఎంపీగా గెలిపిస్తే ఏం చేయాలనేది ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకున్నాం. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఐటీ హబ్గా మారుస్తా. ఇందులో ముఖ్యంగా భువనగిరి, ఇబ్రహీంపట్నం, తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాలకు ఐటీ కంపెనీలను తీసుకొస్తా. ఈ ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు రావడం వల్ల స్థానికంగా ఎంతో అభివృద్ధి జరుగుతుంది. ప్రధానంగా నిరుద్యోగులకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అదే విధంగా భువనగిరిని ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తా.
యాదగిరిగుట్ట పరిసరాల్లో ఆయుష్ యూనివర్సిటీ నెలకొల్పేందుకు కృషి చేస్తా. దీని వల్ల ఎన్నో రకాలు మేలు జరుగుతుంది. ఇప్పటికే గుట్టకు మాజీ సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీని మంజూరు చేశారు. భక్తుల తాకిడి పెరిగిన యాదగిరిగుట్ట వరకు మెట్రో రైల్ను తీసుకొస్తా. రాయగిరి వరకు ఎంఎంటీఎస్ను పొడిగించేందుకు శాయశక్తులా కృషి చేస్తా. అదే విధంగా అటు ఇబ్రహీంపట్నానికి మెట్రో రైలును రప్పిస్తా. జాతీయ రహదారులను ఆరు లేన్లుగా మార్పిస్తా.
భువనగిరిని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా తీర్చిదిద్దుతా. మూసీ ప్రక్షాళన చేపట్టేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటా. మూసీతో అనేక మండలాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తా. బునాదిగాని, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వలను పూర్తి చేయిస్తా. వేములకొండ, మోకిల, కొమురెల్లి ఆలయాల అభివృద్ధికి కంకణబద్ధుడై పనిచేస్తా. ఎయిమ్స్లో మౌలిక సదుపాయాలు కల్పించేలా నా వంతు ప్రయత్నం చేస్తాను.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో అంటకాగుతున్నారు. ఆయన పెద్ద గజదొంగ. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, నేతలను చేర్చుకుంటున్నారు. రాహుల్ గాంధీ ఐడియాలజీకి భిన్నంగా రేవంత్ రెడ్డి
పరిపాలన కొనసాగిస్తున్నారు.
కేంద్రంలో బీజేపీ దేశానికి పదేండ్లుగా చేసిందేమీ లేదు. కనీసం చెప్పుకోవడానికి ఫలానా పని అంటూ కనిపించడంలేదు. 2019లో పుల్వామా దాడిని ఉపయోగించుకున్నారు. ఇప్పుడు రామమందిరం పేరుతో రాజకీయం చేస్తున్నారు. త్రేతా యుగం నాటి నుంచి రాముడు ఉన్నారు. వేల సంవత్సరాలుగా దేవుడిగా కొలుస్తాం. బీజేపీ వాళ్లే రాముడిని కొత్తగా కనిపెట్టినట్లు డంభాచారం చేస్తున్నారు. కేవలం మతం, సెంటిమెంట్తో పబ్బం గడుపుకొంటున్నది. మాకు అన్ని మతాలు సమానమే. రెచ్చగొట్టి రాజకీయం చేయాలనుకుంటే బీజేపీకి పుట్టగతులుండవ్. బూర నర్సయ్యగౌడ్ ఎంపీగా గెలిచినా ఏం చేయలేదు. ఇప్పుడు కూడా ఏమీ చేయరు.
కాంగ్రెస్ను గెలిపిస్తే రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయింది. రాష్ట్ర సర్కారు రైతులను అరిగోస పెడుతున్నది. కరువు తాండవిస్తున్నా కనీసం పట్టించుకోవడంలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో గాలి హామీలు ఇచ్చారు. రూ. 2లక్షల రుణమాఫీ, రైతుబంధు, ధాన్యానికి క్వింటాల్కు రూ. 500 బోనస్ను మర్చిపోయారు. ఆడబిడ్డల పెండ్లిళ్లకు తులం బంగారం దేవుడెరుగు.. కల్యాణ లక్ష్మికే దిక్కులేదు. చేపలు, గొర్రెల పంపిణీ పథకాలు ఆగిపోయాయి.