నీలగిరి, ఆగస్టు 26 : ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్, మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. వారి నుంచి 4.34 క్వింటాళ్ల గంజాయి, డీసీఎం, మూడు కార్లు, బైక్, ఎనిమిది సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. శుక్రవారం జిల్లా ఎస్పీ కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె కేసు వివరాలు వెల్లడించారు.
మిర్యాలగూడ మండలం ఆలగడప టోల్ప్లాజా వద్ద వాహనాల తనిఖీలో పోలీసులు కారు, బైక్ను ఆపి తనిఖీ చేయగా 2 కేజీల బరువు గల 27 గంజాయి ప్యాకెట్లు లభించినట్లు తెలిపారు. నిందితులు ఒడిషాకు చెందిన మజ్జి శంకర్, హైదరాబాద్కు చెందిన గోపాల్, దూల్పేటకు చెందిన చందన్, డ్రైవర్ ఇప్పి శివను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఒడిషా నుం చి గంజాయి రవాణా చేస్తున్నట్లు తెలిపారు. మరొక ఘటనలో శుక్రవారం ఉదయం టాస్క్ఫోర్స్ పోలీసులు మిర్యాలగూడ పట్టణంలోని ఖలీల్డాబా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా డీసీఎం, రెండు కార్లలో 380 కేజీల గంజాయి రవాణాను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కర్నాటకకు చెందిన వీరేశ్, జన్వదేకర్, ప్రశాంత్, రాజమండ్రికి చెందిన కోమలిగా గుర్తించారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో టాస్క్ఫోర్స్ డీఎస్పీ మొగిలయ్య, మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్రావు, సీఐలు సత్యనారాయణ, రాఘవేందర్, ఎస్ఐలు నర్సింహులు, శివతేజ పాల్గొన్నారు.