సూర్యాపేట అర్బన్, ఫిబ్రవరి 14 : ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు విడుతలుగా మార్చి 2 వరకు జరుగనున్నాయి. సూర్యాపేట జిల్లాలోని 71 కళాశాలలకు చెందిన 7,886 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానుండగా 52 సెంటర్లను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు ఇన్విజిలేటర్లతో పాటు ఫ్లయింగ్ స్కాడ్, జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీల ద్వారా పర్యవేక్షించనున్నారు. జనరల్ విద్యార్థుల కోసం 44, ఒకేషనల్ విద్యార్థుల కోసం 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మూడు విడుతలుగా పరీక్షలు
ఇంటర్ ప్రాక్టికల్స్ను మూడు విడుతలుగా నిర్వహించనున్నారు. మొదటి విడుత ఈ నెల 15 నుంచి 20 వరకు, రెండో విడుత 21 నుంచి 26 వరకు, మూడో విడుతలో 27 నుంచి 2 వరకు నిర్వహిస్తారు. విద్యార్థులను గ్రూపుల వారీగా విడదీసిన నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికే పరీక్షల సెంటర్ల నిర్వాహకులకు ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించి సిద్ధం చేసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జానపాటి కృష్ణయ్య తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
యాదాద్రి జిల్లాలో 12,298 మంది
భువనగిరి అర్బన్ : యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇంర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షల నిర్వహణకు 44 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో జనరల్ 38, ఒకేషనల్ 6 కేంద్రాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 12,298 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్కు హాజరు కానున్నారు. పరీక్షలను మూడుదశల్లో నిర్వహించేలా అధికారులు షెడ్యూల్ రూపొందించారు. పరీక్షలను రెండు ఫ్లైయింగ్ స్కాడ్స్, ఒక డెక్ కమిటీ పర్యవేక్షించ నున్నాయి.
నల్లగొండ జిల్లాలో 20,038 మంది విద్యార్థులు
రామగిరి : నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు 108 ఉండగా, వాటిల్లో జనరల్, ఓకేషనల్ విభాగాల్లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 20,038 మంది ప్రాక్టికల్ పరీక్షకు హాజరు కానున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 92 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణపై డీఐఈఓ దస్రూనాయక్ జిల్లా కేంద్రంలో సదస్సు నిర్వహించి అవగాహన కల్పించారు.
ఓటీపీ ద్వారా ప్రశ్నపత్రం..
ప్రాక్టికల్స్ రాసే విద్యార్థుల ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసేందుకు ఇంటర్ బోర్డు కొత్త విధానం అనుసరించనున్నది. పరీక్షకు అరగంట ముందుగా చీఫ్ ఎగ్జామినర్ ఫోన్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేసిన తర్వాతే ప్రశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేసుకునేందుకు వీలవుతుంది. దాంతో ప్రశ్నలు ముందుగా తెలిసే అవకాశం ఉండదు. హాల్ టికెట్ నంబర్ ఆధారంగా ఏ విద్యార్థికి ఏ సెట్ ప్రశ్నపత్రం ఇవ్వాలనే అంశాన్ని పేపర్ కోడ్ ఆధారంగా వెబ్సైట్లో నమోదు చేస్తారు. దాని ప్రకారమే ఇవ్వాల్సి ఉంటుంది. పరీక్ష సమయాని కంటే అరగంట ముందుగ మాత్రమే ప్రశ్నపత్రం డౌన్లోడ్ చేసే అవకాశం ఉంది.
గంటలోపే మూల్యాంకనం
ప్రయోగ పరీక్షల్లో విద్యార్థుల సమాధాన పత్రాలను గంట లోపే మూల్యంకనం చేస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పరీక్షల సమాధాన పత్రాలను మూల్యాంకనం చేసి మారుల జాబితాను ఎగ్జామినర్ ఇంటర్ బోర్డుకు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయమై ఇప్పటికే ఇంటర్బోర్డు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఫీజుల పేరుతో విద్యార్థుల హాల్టికెట్లు ఆపవద్దని, ఆలా చేస్తే చర్యలు తీసుకుంటామని డీఐఈఓ రమణి హెచ్చరించారు.