దేశానికి అన్నం పెట్టే రైతు ఏదైనా కారణంతో చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడొద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా రూ.5 లక్షల బీమాను అమలు చేస్తున్నది. 2018 నుంచి అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుంటూనే పాత రైతులకు బీమా రెన్యూవల్ చేస్తున్నది. ప్రతి ఏడాది ఆగస్టు 13 బీమా గడువు ముగుస్తుండగా ఈ ఏడాది ఆగస్టు 5 వరకు దరఖాస్తులు స్వీకరించింది. నల్లగొండ జిల్లాలో కొత్తగా 23,531 మంది రైతులు బీమా పరిధిలోకి వచ్చారు. 2,65,200 మందికి రెన్యూవల్ చేశారు. మొత్తం 2,88,731 మందికి బీమా వర్తించనున్నది. ఐదేండ్లలో వివధ కారణాలతో మృతి చెందిన 7,068 మంది రైతు కుటుంబాలకు రూ.338.95 కోట్లు అందాయి.
నల్లగొండ, ఆగస్టు 8: రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా కోసం కొత్త పట్టాదారులకు అవకాశం కల్పించేందుకు వ్యవసాయ శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఈ డ్రైవ్లో జిల్లా వ్యాప్తంగా కొత్తగా 23,531 మంది రైతుల తమ పేర్లు నమోదు చేసుకున్నారు. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు ,గతంలో బీమాకు దరఖాస్తు చేసుకోని రైతుల కోసం ప్రభుత్వం జూలై 11 నుంచి ఈ నెల 5 వరకు అవకాశం ఇచ్చింది. అయితే వీరితో పాటు గతంలో నమోదైయిన రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమాను ఈ నెల 13న మరో ఏడాది అమలు చేసేందుకు రెన్యువల్ చేసే బీమా పథకంలో అర్హులుగా ఉండనున్నారు. జిల్లాలో 2017-18 నుంచి ఈ రైతు బీమా పథకం అమలవుతుండగా ఇప్పటి వరకు 2.65,200లక్షల మంది రైతులు అర్హులుగా ఉన్నారు. తాజాగా దరఖాస్తు చేసుకున్న వారిలో మరో 23,531 మంది కొత్తగా చేరనున్నారు.ఈ ఏడాది రైతు బీమాకు మొత్తంగా 2,88,731 మందికి ప్రభుత్వం ఈ ఏడాది ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించనుంది.
జూన్18లోగా పాస్ పుస్తకాలు పొందిన వారందరికీ..
రైతు బంధు, బీమాను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ ఏడాది జూన్18వ తేదీ లోపు పాస్ పుస్తకాలు తీసుకున్న వారికి ఈ అవకాశం కల్పించగా అప్పటి వరకు జిల్లాలో పోడు భూముల పట్టాలు తీసుకున్న వారితో పాటు మొత్తగా 27,510 మంది ఉన్నారు. అందులో గడువు లోపు 23,531 మంది రైతు బీమాకు దరఖాస్తు చేసుకోగా మిగిలిన వారు చేసుకోలేదు. అయితే 18 నుంచి 59 ఏండ్ల వయసు కలిగిన వారి నుంచి మాత్రమే దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం వీరికి మాత్రమే బీమా కవరేజీ కల్పించనుంది.
ఇప్పటి వరకు 7,068 మంది రైతుల మృతి..
జిల్లాలో రైతు బీమా అమలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులు వేర్వేరు కారణాలతో మొత్తంగా 7,068 మంది చనిపోగా వారిలో 6,779 మందికి రైతు బీమా కింద ఎల్ఐసీ నుంచి రూ.338.95 కోట్లు అందడం జరిగింది. 2017-18 నుంచి నుండి ఈ పథకం జిల్లాలో ప్రారంభం కాగా ఇప్పటి వరకు ప్రభుత్వమే ప్రతి ఏటా రైతుల కోసం ఉచితంగా బీమా ప్రీమియం చెల్లించడంతో రైతు ఏ కారణం చేత చనిపోయినప్పటికీ ఈ ైక్ల్లెయిమ్ అందుతుంది. రైతు చనిపోయిన వారం పది రోజుల్లో నామినీ ఖాతాలో ఈ డబ్బులు జమ అవుతున్నాయి.
గుంట జాగాఉన్న పథకం వర్తింపు
రైతు ఏ కారణం చేతనైనా మరణిస్తే ఆ కుటుంబం ఆర్థ్దిక కారణాలతో రోడ్డున పడొద్దని ఆలోచనతో ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్నది. గుంట జాగ ఉన్న రైతులు కూడా ఈ పథకం కింద అర్హులైతే వారందరి నుంచి దరఖాస్తు స్వీకరించాం. వీరందరికీ ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది. మరణించిన రైతు కుటుంబాలకు రూ. 5 లక్షలు అందుతాయి.
-సుచరిత, డీఏఓ, నల్లగొండ