తుంగతుర్తి, జూన్ 23 : తుంగతుర్తి మండల పరిధిలోని రావులపల్లి గ్రామానికి చెందిన రైతు కసిరబోయిన కిష్టయ్య ధాన్యం విక్రయంలో తనకు అన్యాయం జరిగిందని మంగళవారం ఆవేదన వ్యక్తం చేశాడు. గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో తాను పండించిన 129 బస్తాల ధాన్యాన్ని కాంటా వేసి నేరేడుచర్లకు చెందిన శివ బాలాజీ రైస్ మిల్ కు లారీ లోడుతో వెళ్లింది. అక్కడ ఉన్న నిర్వాహకులు తడిసిన ధాన్యమని 50 బస్తాలు కటింగ్ చేస్తేనే ధాన్యాన్ని దిగుమతి చేసుకుంటామని, లేకుంటే లారీని అన్లోడ్ చేయబోమని చెప్పారు. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో బలవంతంగా ఆ నిబంధనకు అంగీకరించాల్సి వచ్చిందని వాపోయాడు. కొనుగోలు కేంద్రాలలో రైతులు పండించిన వరి ధాన్యం తడిసినా కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పినా మిల్లర్లు మాత్రం దిగుమతి చేసుకోవడం లేదని మిల్లర్లు తరుగు, తడిసిన ధాన్యమంటూ రైతులను నిలువునా మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్తో పాటు సంబంధిత ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని బాధిత రైతుకు న్యాయం చేయాలని, తడిసిన ధాన్యం పేరుతో జరుగుతున్న కోతలను అరికట్టాలని కోరాడు.