మునుగోడు, ఆగస్టు 22 : రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో కార్పొరేటుకు దీటుగా సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నది. దీంతోపాటు స్కూళ్ల సమగ్ర సమాచారాన్ని పక్కాగా నమోదు చేసేందుకు సాంకేతిక సౌకర్యాన్ని కల్పిస్తున్నది. ఇందుకోసం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ట్యాబ్లు అందజేశారు. పాఠశాలల వివరాలను గతంలో ఉపాధ్యాయులు స్మార్ట్ఫోన్ల ద్వారా అప్లోడ్ చేస్తున్న సమయంలో కొంత వరకు ఇబ్బంది పడడం, సమాచారం పక్కాగా నమోదు కాకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. వాటికి చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలకు ట్యాబ్లు పంపిణీ చేసింది.
ఇక నుంచి వివరాలన్నీ ట్యాబ్లోనే..
ప్రస్తుతం ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల విద్యార్థులు, ప్రవేశాలు, టీసీల జారీ, మార్కుల వివరాల నమోదు, ఉపాధ్యాయుల సమాచారం, మన ఊరు – మన బడి పనుల పురోగతి, మధ్యాహ్న భోజనం వివరాలు, ఎస్ఎంసీ సమావేశాల నిర్వహణ, చైల్డ్ ఇన్ఫో, విద్యార్థుల సామర్థ్యాల పురోగతి, తొలిమెట్టు ద్వారా విద్యార్థుల్లో మెరుగుపడిన విద్యా సామర్థ్యాల వివరాలు ట్యాబ్లో నమోదు చేసి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు పంపుతున్నారు. ప్రధానంగా తరగతి గదుల్లో చదువుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయల ఫొటోలు సెల్ఫీ తీసుకొని యాప్లో అప్లోడ్ చేసి, వారి ఐడీ నంబర్, విధులు నిర్వహిస్తున్న పాఠశాల, యూడైస్ కోడ్ నంబర్ తదితర వివరాలు నమోదు చేయాలి. విధులకు గైర్హాజరైనవారు హాజరైనట్లు సంతకం చేసే అవకాశం ఉండదు. మధ్యాహ్న భోజనం వివరాలు సైతం పక్కాగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం పాఠశాలలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు వెంటనే ట్యాబ్లో నమోదు చేస్తున్నారు.
ట్యాబ్లతో ఎంతో ఉపయోగం
మండల వ్యాప్తంగా 38 పాఠశాలలుండగా 30 ప్రాథమిక, 4 ప్రాథమికోన్నత పాఠశాలలకు మొదటి విడుతగా ట్యాబ్లు అందాయి. యాప్ల ఇన్స్టాలేషన్, ఆన్లైన్ ప్రక్రియపై ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయలకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ట్యాబ్లు అందిన పాఠశాలల్లో స్కూళ్లకు సంబంధించిన సమాచారాన్ని నిక్షిప్తిం చేస్తున్నారు.
– కూకుంట్ల నరిసింహ, ఎంఈఓ, మునుగోడు