యాదాద్రి, డిసెంబర్ 18 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. సెలవు దినం కావడంతో స్వామి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మాఢవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపంలోని క్యూలైన్లు భక్తులతో సందడిగా మారాయి. కొండపైకి వాహనాల రద్దీ సాగింది. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు నిర్వహించే సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బంగారు పుష్పాలతో ఉత్సవమూర్తిని అర్చించారు. స్వామి, అమ్మవార్ల నిత్య తిరు కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వైభవంగా సుదర్శన నారసింహ హోమం
స్వామి వారి సుదర్శన నారసింహ హోమం ఘనంగా నిర్వహించారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం చేశారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం సుదర్శన నారసింహ హోమం ఘనంగా నిర్వహించారు. అనంతరం మొదటి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు.
సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. ధనుర్మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆండాళ్ అమ్మవారిని దివ్య మనోహరంగా అలంకరించి రంగనాథుడిని పరిణయమాడేందుకు గోదాదేవి చేపట్టిన తిరుప్పావై, పొంగళి నివేదన, పాశుర పఠనం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి.
స్వామి వారి ధర్మ దర్శనానికి 3గంటలు, వీఐపీ దర్శనానికి 2గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామివారిని సుమారు 38వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.47,71,692 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
స్వామివారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
శ్రీవారిని హైకోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వర్రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఉదయం స్వామివారి సుదర్శన నారసింహ హోమం, కల్యాణోత్సవ సేవ, నిత్య తిరుకల్యాణోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం స్వయంభువుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఆలయ సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు వేదాశీర్వచనం చేయగా, ఆలయాధికారులు స్వామివారి ప్రసాదం అందించారు.