సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
35వ జాతీయ పుస్తక వేడుక ప్రారంభోత్సవం
సిటీబ్యూరో, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) / కవాడిగూడ : జ్ఞాన సంపదను జాతికి అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతియేటా నగరంలో పుస్తక వేడుక నిర్వహణకు ప్రోత్సహిస్తున్నదని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం) మిద్దె రాములు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 35వ హైదరాబాద్ జాతీయ పుస్తక వేడుకను గురువారం మధ్యాహ్నం మంత్రి శ్రీనివాస్గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్, హైదరాబాద్ పుస్తక ప్రదర్శన అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ అధ్యక్షతన అలిశెట్టి ప్రభాకర్ వేదికలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచికి ఉపయోగించుకుంటే విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారన్నారు. పుస్తక పఠనం ద్వారానే జ్ఞానయోధులుగా నిలుస్తారని సూచించారు. పుస్తక ప్రదర్శన ప్రారంభోత్సవం సందర్భంగా అతిథులకు విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. గ్రంథాలయ ఉద్యమ నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు జైని మల్లయ్యగుప్తాకు సభాప్రాంగణంలో మౌనం పాటించి నివాళులర్పించారు. కార్యక్రమంలో పుస్తక ప్రదర్శన ఉపాధ్యక్షుడు కోయ చంద్రమోహన్, కార్యదర్శి శృతికాంత్ భారతి, కోశాధికారి పి.రాజేశ్వర్రావు పాల్గొన్నారు.
పుస్తక పఠనం లేకపోతే చరిత్రను మర్చిపోతాం
పుస్తక పఠనం లేకపోతే చరిత్రను మర్చిపోయే ప్రమాదం ఉంది. గతంలో వచ్చిన ఓ సర్వేను పరిశీలిస్తే 74శాతం అమెరికన్లు తమకు స్వాతంత్య్రం ఎప్పుడొచ్చిందని ప్రశ్న వేస్తే చెప్పలేకపోయారు. దీనికి కారణం పుస్తకాన్ని మర్చిపోవడమే. 75వ భారత స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రదర్శించిన గాంధీ చిత్రాన్ని 80 లక్షల మంది విద్యార్థులు వీక్షించారు. దీని ద్వారా వారు చాలా విషయాలు తెలుసుకున్నామని చెప్పారు. అందుకే పుస్తకం చదవడం ఒక అభిరుచిగా మార్చుకోవాలి.
– అల్లం నారాయణ, మీడియా అకాడమీ చైర్మన్
ఇది పండుగ
పుస్తకాల్లోనే జ్ఞానం ఉంది. పాండిత్యాన్ని సాధిస్తే.. ప్రపంచంలో ఎక్కడైనా అవకాశాలు మెండుగా ఉంటాయి. జ్ఞానంతోనే చరిత్రలో నిలిచి గెలిచేందుకు అవకాశం ఉంటుంది. పుస్తక ప్రదర్శన అనడం కంటే.. పుస్తకాల జాతర, పండుగ, వేడుక అని పిలువాలె.
– తిగుళ్ల కృష్ణమూర్తి,నమస్తే తెలంగాణ ఎడిటర్
పుస్తక పఠన దినంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పుస్తక పఠన దినంగా పాటించాలి. సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యార్థులు ఒకరికొకరు బహుమానంగా పుస్తకాలనే ఇచ్చిపుచ్చుకోవాలి. నేటి విద్యార్థులు రేపటి భారత జ్ఞానయోధులుగా నిలువాలి. పుస్తకాలను విరివిగా చదవాలి. రాయాలి.
– జూలూరి గౌరీశంకర్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు, సాహిత్య అకాడమీ చైర్మన్
పుస్తక పఠనంతో జ్ఞాపకశక్తి పెంపు
పుస్తకం అంటే తరువాతి తరాలకు జ్ఞానాన్ని మోసుకెళ్లేది. పుస్తకాలు చదవడం వల్ల 20 శాతం నుంచి 50 శాతం మేరకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దీంతోపాటు ఏకాగ్రత పెరుగుతుంది. తల్లిదండ్రులు పుస్తకాలను చదువుతూ.. పిల్లలను చదివించాలి. ఇది ఉద్యమంగా జరుగాలి. ప్రతి విద్యార్థి ఒక సంవత్సరంలో పది పుస్తకాలు చదివి మరొకరి చేత చదివించాలి.
– కె.శ్రీనివాస్, ఆంధ్రజ్యోతి సంపాదకుడు
ప్రశ్నించేతత్వం పెరుగుతుంది
పుస్తకం చదవడం వల్ల ప్రశ్నించే తత్వం పెరుగుతుంది. చదవడం వల్లనే విప్లవాలు వస్తాయి. చైతన్యమే ఒక విప్లవం.
– సుధాభాసర్, నవ తెలంగాణ సంపాదకుడు
మాతృభాషను వదులుకోలేం
హైదరాబాద్ పుస్తక ప్రదర్శనకు తెలంగాణ ప్రభుత్వం అనేక విధాలుగా ప్రోత్సహించడం సంతోషకరం. ఎన్ని భాషలు ప్రభావం చూపినా మాతృభాషను వదులుకోలేం.
– కె.శ్రీనివాస్రెడ్డి,ప్రజాపక్షం ఎడిటర్