యాదగిరిగుట్ట, అక్టోబర్ 10 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో మంగళవారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్ష పుష్పార్చన పూజలు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో అర్చక బృందం, వేద పండితులు వివిధ రకాల పూలతో లక్ష పుష్పార్చన పూజలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు.
ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శ నారసింహ హోమం నిర్వహించిన అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై ప్రాకార మండపంలో ఊరేగించారు. అనంతరం లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరుకల్యాణ తంతు జరిపించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి, ఉదయం ఆరగింపు చేపట్టారు.
స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం చేశారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం వేళలో స్వామివారికి వెండి మొక్కు జోడు, దర్బార్ సేవ ఘనంగా నిర్వహించారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ ఆకుపూజ చేపట్టారు. ప్రధానాలయంతో పాటు క్యూ కాంప్లెక్స్ చెంత గల గుడిలో హనుమంతుడిని సింధూరంతో అలంకరించి అభిషేకించారు. తమలపాకులతో అర్చన చేశారు.
వేదమంత్రాల మధ్య నిర్వహించిన పూజల్లో పలువురు భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. తమలపాకులతో అర్చన చేశారు. లలితాపారాయణం చేశారు. ఆంజనేయ స్వామికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించారు. ఉదయం నుంచి సాయ ంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.10,43,194 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్. గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి తెలిపారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగ నేపథ్యంలో ఈ నెల 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు సాయంత్రం 5నుంచి 8గంటల వరకు ప్రధానాలయ తూర్పు మాఢవీధుల్లో బతుకమ్మ సంబురాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. ఈ నెల 20న వైభవోపేతంగా బతుకమ్మ పండుగ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక మహిళలు పాల్గొంటారని వెల్లడించారు.