యాదగిరిగుట్ట, సెప్టెంబర్16 : యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. శనివారం ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లను ముస్తాబు చేసి గజవాహనంపై వేంచేపు చేసి సేవా కార్యక్రమాన్ని జరిపారు. అనంతరం స్వామివారికి సుదర్శన నారసింహ హోమం జరిపారు. సుదర్శనమూర్తులను కొలుస్తూ హవనం నిర్వహించారు. అనంతరం కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వెంచేపు చేసి కల్యాణతంతు చేపట్టారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరుకల్యాణతంతు జరిపారు.
కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణతంతును వీక్షించారు. తెల్లవారు జామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. నిజరూప దర్శనంలో స్వయంభూ నారసింహస్వామిని భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు.
ప్రధానాలయ ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా సువర్ణ పుష్పార్చనలు జరిపించారు. బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. సాయంత్రం స్వామివారికి తిరువీధి, దర్బార్ సేవ అత్యంత వైభవంగా చేపట్టారు. రాత్రి స్వామివారికి తిరువారాదన చేపట్టి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన జరిపారు. పాతగుట్ట స్వామివారికి నిత్యారాధనలు అత్యంత వైభవంగా సాగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో స్వామివారి ఆలయం సందడిగా కనిపించింది. సుమారు 17 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి స్వామివారి ఖజానాకు రూ.39,20,976 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.