యాదాద్రి, డిసెంబర్ 27 : యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్లకు నిత్యారాధనలు మంగళశారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పారు. అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామి వారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు.
ప్రధానాలయ మొదటి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా ముస్తాబు చేసి గజవాహనంపై వేంచేపు చేసి వెలుపలి ప్రాకార మండపంలో ఊరేగించారు. స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు. కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధానాలయ ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయం త్రం వరకు పలు దఫాలుగా భక్తులకు సువర్ణ పుష్పార్చన పూజలు చేశారు. సాయంత్రం వేళలో స్వామివారికి తిరువీధి, దర్బార్ సేవ ఘనంగా నిర్వహించారు.
పాతగుట్టలో స్వామి వారికి నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామికి ఆకుపూజను ఘనంగా నిర్వహించారు. హనుమంతుడిని సింధూరంతో అలంకరించి తమలపాకులతో అర్చించారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా అర్చకులు ఉదయం 4.30నుంచి 5.15గంటల వరకు వేదమంత్రాలు పఠిస్తూ అమ్మవార్లకు తిరుప్పావై పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ధనుర్మాన విశిష్టతను భక్తులకు వివరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 32వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామి ఖజానాకు రూ.40,46,863 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 30న యాదాద్రికి రానున్న నేపథ్యంలో పర్యటన సజావుగా సాగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎయిర్ఫోర్స్ అభిషేక్ పల్వార్ బృందంతో కలిసి కలెక్టర్ పమేలా సత్పతి, డీసీపీ నారాయణరెడ్డి, ఆర్డీఓ భూపాల్రెడ్డి యాదాద్రి ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొండ కింద పార్కింగ్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ను మంగళవారం పరిశీలించారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్ బృందం మూడు హెలికాప్టర్లతో ట్రయల్ రన్ నిర్వహించింది. హెలిప్యాడ్ ప్రాంతంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి పటిష్ట చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎయిర్ ఫోర్స్ సిబ్బంది అధికారులకు పలు సూచనలు చేశారు. కొండపైకి వెళ్లేందుకు వినియోగిస్తున్న ఫ్లైఓవర్కు విద్యుద్దీపాలంకరణ ఏర్పాట్లు చేశారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 1,27,100
ప్రధాన బుక్కింగ్ ద్వారా 3,06,878
వీఐపీ దర్శనాలు 3,90,000
బ్రేక్ దర్శనాలు 3,18,900
వేద ఆశీర్వచనం 14,400
నిత్య కైంకర్యాలు 8,004
సుప్రభాతం 14,600
ప్రచార శాఖ 16,000
వ్రత పూజలు 66,400
కల్యాణకట్ట టిక్కెట్లు 70,500
ప్రసాద విక్రయం 16,05,780
వాహనపూజలు 12,100
అన్నదాన విరాళం 1,31,628
శాశ్వత పూజలు 30,000
సువర్ణ పుష్పార్చన 1,55,180
యాదరుషి నిలయం 90,544
పాతగుట్ట నుంచి 36,410
కొండపైకి వాహన ప్రవేశం 5,00,000
శివాలయం 12,800
ఇతర విభాగాలు 2,66,739