యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): రాయగిరి గుట్టల్లో శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారు స్తంభోద్భవుడిగా భక్తులకు సాక్షాత్కరిస్తున్నారు. సదరు ఆకృతి అచ్చంగా నారసింహుడి దివ్య మనోహర స్వరూపాన్ని పోలి ఉంది. తిరుమల కొండల్లో శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్య రూపమైన అనంత శయనం, గరుడ పక్షి ఆకారం మాదిరిగానే యాదగిరిగుట్టలో సైతం శాంత నారసింహుడు అవతరించారు. కొండల్లో వెలసిన స్తంభోద్భవుడిని భక్తులు ప్రతి రోజూ చూస్తూ పునీతులవుతున్నారు.
అచ్చంగా నారసింహుడే..
యాదగిరి గుట్టను ఆనుకొని ఉన్న రాయగిరి గుట్టలో ఇటీవల ఓ వ్యక్తికి అపురూపమైన స్వామి వారి ఆకృతి కనిపించింది. దీంతో ఆయన స్తంభోద్భవుడి ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. యాదగిరిగుట్ట నుంచి రాయగిరి వెళ్లే మార్గంలో ఫ్లై ఓవర్ ముందు కుడి చేతి వైపు ఉన్న అరణ్యంలో రోడ్డుపై నుంచి చూస్తే శాంత నరసింహుడు దర్శనమిస్తారు. నోరు, ముకు, కళ్లు, చెవి, కిరీటంతో ఉన్నట్లుగా స్వామివారి ఆకృతి మనకు కనిపిస్తుంది. స్వయంగా వెళ్లి చూస్తే నిజంగా స్వామి వారి దివ్య రూపాన్ని చూసినట్లే ఉంటుంది. ఈ విషయం ప్రచారం కావడంతో గుట్టకు వచ్చిన భక్తులు.. అకడ ఆగి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. సెల్ఫోన్లలో ఫొటోలు తీస్తూ ఆనంద పరవశులవుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి మాదిరిగా యాదగిరిగుట్ట ఆలయాన్ని తీర్చిదిద్దాలనేది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం. అందులో భాగంగానే రూ.1250 కోట్లతో గుట్టను కూడా ఇల వైకుంఠంగా మలిచారు. భక్తుల తాకిడి కూడా అందుకు తగిన విధంగానే బాగా పెరిగింది. తిరుమల కొండల్లో దూరం నుంచి గమనించినప్పుడు అనంతశయన దివ్య మనోహర ఆకారం కనిపిస్తుంది. అంతే కాకుండా గరుడ పక్షి రూపం కూడా కనిపిస్తుంది. ఈ రెండింటిని తిరుమల తిరుపతి దేవస్థానం దైవంగా భావించి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నది.
గరుడ పక్షి ఆకారం ఉన్నచోట ఏటా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. టీటీడీ వెబ్సైట్, యాప్లో అనంత శయన రూపంతో కూడిన ఫొటోలు దర్శనమిస్తాయి. కానీ యాదగిరిగుట్టలో మాత్రం సాక్షాత్తు నారసింహుడి ఆకృతే దర్శనమిస్తే.. అటు ప్రభుత్వం.. ఇటు అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కనీసం అధికారులు సందర్శించకపోవడం చూస్తుంటే వారి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఇటీవల కొందరు యువకులు స్వామి వారి వద్ద గుర్తుగా జెండా ఏర్పాటు చేస్తే.. రిజర్వు ఫారెస్టు పరిధిలో ఉందని చెబుతూ అటవీ శాఖ అధికారులు తొలగించారు. ఇక ఈ ప్రాంతమంతా వైటీడీఏ (యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ) పరిధిలోనే ఉంది. అయినప్పటికీ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.