యాదగిరిగుట్ట, ఫిబ్రవరి17 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు వైభవంగా జరిగాయి. శుక్రవారం తెల్లవారు జామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన జరిపి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. నిజరూప దర్శనంలో స్వయంభూ నారసింహులు భక్తులకు దర్శనమిచ్చారు.
స్వామివారికి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టి భక్తులకు స్వామి, అమ్మవార్ల దర్శనభాగ్యం కల్పించారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తుల పాదాల వద్ద 108 బంగారు పుష్పాల ఉంచి అష్టోత్తర నామాలు పఠిస్తూ అర్చించారు. అనంతరం స్వామివారికి హారతినిచ్చి భక్తుల గోత్రనామాలు పేరిట సంకల్పం చేశారు. వెలుపలి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్లకు నిత్య తిరుకల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా జరిగింది. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవ జరిపారు.
అనంతరం కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను వెంచేపు చేసి కల్యాణతంతు చేపట్టారు. లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా నిత్య తిరుకల్యాణతంతు జరిపారు. సాయంత్రం స్వామివారికి తిరువీధి, దర్బార్ సేవలు చేపట్టారు. రాత్రి స్వామివారికి తిరువరాధన చేపట్టి తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన జరిపారు. పాతగుట్టలో నిత్యారాధనలు వైభవంగా జరిగాయి. సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం జరిపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 13 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలిపి స్వామివారి ఖజానాకు రూ.16,73,356 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఇన్చార్జి ఈఓ రామకృష్ణారావు తెలిపారు.
లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు స్వయంభూ ఆలయాన్ని అధికారులు ముస్తాబు చేస్తున్నారు. ఈ నెల 21న ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మార్చి 28న ప్రధానాలయం ఉత్తర మాఢవీధుల్లోని వాయుదిశలో రథశాల, లిప్టు ప్రాంతంలో తిరు కల్యాణోత్సవం నిర్వహణకు ప్రత్యేక కల్యాణ మండపం నిర్మిస్తున్నారు. శుక్రవారం ఆలయ అధికారులు మార్కింగ్ చేపట్టారు. కల్యాణ మండపం ఎదురుగా ఉత్తర మాఢవీధుల్లో 10 వేల మంది భక్తులు కూర్చునేలా లాబీలు ఏర్పాటు చేస్తున్నారు.
పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి అనుబంధ శివాలయంలో శుక్రవారం మూడో రోజు మహా శివరాత్రి ఉత్సవాలను అర్చకులు కనులపండువగా జరిపారు. ఉదయం ప్రధానాలయంలో వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములచే రుద్రహవనం, శివపంచాక్షరి జపం, నందీశ్వర పారాయణం, పంచసూక్త పఠనం, మూలమంత్ర జపం నిర్వహించారు. సాయంత్రం పారాయాణికులతో స్తోత్ర, వేద పారాయణాలు, మంత్ర పుష్పపఠనం, సోమకుంభార్చనలు, మూలమంత్ర పారాయణాలు కొనసాగాయి.
సాయంత్రం7 గంటలకు ఆలయ మాఢ వీధుల్లో శివపార్వతుల కల్యాణమహోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఇన్చార్జి ఈఓ రామకృష్ణారావు, డీఈఓ దోర్బాల భాస్కర్శర్మ, శివాలయ ప్రధానార్చకులు నరసింహరాముల శర్మ, ప్రధాన పురోహితులు గౌరీభట్ల సత్యనారాయణశర్మ, ఏఈఓ గజవెల్లి రమేశ్బాబు, అర్చకులు, పురోహితులు, వేద పండితులు పాల్గొన్నారు.
మహా శివరాత్రి పురస్కరించుకుని రామలింగేశ్వరస్వామి ప్రధానాలయంలో అభిషేకాలు నిర్వహించనున్నారు. రాత్రి లింగోద్భవకాలమున మహాన్యాస పూర్వక శతరుద్రాభిషేకం జరుగనున్నది. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఏర్పాట్లు చేశారు. భక్తులతో జరిపించే అభిషేకానికి రూ.300, శత రుద్రాభిషేకానికి రూ.516 రుసుము నిర్ణయించారు.