యాదగిరిగుట్ట రూరల్, ఫిబ్రవరి 25 : యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇటీవల అక్రమ బ్లాస్టింగ్లు సంచలనం రేకెత్తుస్తున్నాయి. జిల్లాలో కొత్తగా వెంచర్లు చేసేవారు, క్వారీలు నిర్వహించే వారు, బావులు తవ్వడానికి కొందరు విచ్చలవిడిగా పేలుళ్లకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో అక్రమారులను సంప్రదించి సులువుగా పేలుడు పదార్థాలు సంపాదించి పేలుళ్లకు పాల్పడుతున్నారు. పేలుడు పదార్థాల అక్రమ రవాణా, వినియోగంపై నిఘా పెట్టిన రాచకొండ కమిషనరేట్, యాదాద్రి భువనగిరి జోన్ ఎస్ఓటీ పోలీసులు అనుమానిత ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఇటీవల పలు చోట్ల తనిఖీలు నిర్వహించి పెద్ద ఎత్తున జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, మేగర్ బాక్సులు, కనెక్టింగ్ వైర్, బ్లాస్టింగ్ వైర్ను స్వాధీనం చేసుకున్నారు.
నిబంధనల ప్రకారం పేలుడు పదార్థాలను ఎక్స్ప్లోజీవ్స్ వాహనాల్లో మాత్రమే తరలించాలి. కానీ అక్రమార్కులు నిబంధనలకు విరుద్ధంగా కార్లు, టాటా ఏస్, ద్విచక్ర వాహనాల్లో రవాణా చేస్తున్నారు. క్వారీలు, వెంచర్లలో రాళ్లు, గుండ్లను పగులకొట్టడం తదితర వ్యవహారాలకు వినియోగిస్తున్నారు. అయితే ఈ అక్రమ పేలుళ్లు ఎకువగా ఆలేరు, బీబీనగర్, యాదగిరిగుట్ట, తురపల్లి, బొమ్మలరామారం, భువనగిరి, భువనగిరి మండలం, చౌటుప్పల్, గుండాల మండలాల్లో అధికంగా వినియోగిస్తున్నారు.
అక్రమ పేలుళ్ల సంఘటనలు తరుచూ చోటుచేసుకుంటుండంతో సీపీ డీఎస్.చౌహాన్, డీసీపీ రాజేశ్ చంద్ర ఆదేశాల మేరకు రాచకొండ కమిషనరేట్, యాదాద్రి భువనగిరి జోన్ ఎస్ఓటీ పోలీసులు నిఘాను పటిష్టం చేశారు. ప్రధానంగా జిల్లాకు ఈ పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయనే అంశంపై ఆరా తీస్తున్నారు. రవాణాకు పాల్పడుతున్న వారు, వారికి సహకరిస్తున్న వారు, డ్రైవర్లు, వాహానాలు, అనుమానితులు ఇలా అందరిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఎక్కడైన బ్లాస్టింగ్ అవసరమని భావిస్తే ఆ మండలం పరిధిలోని పోలీస్ స్టేషన్లో తప్పక దరఖాస్తు చేసుకోవాలి. పోలీసులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి క్షేత్రస్థాయిలో ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తారు. అనంతరం మాత్రమే మందుగుండు సామాగ్రిని ఎంత మోతాదులో వినియోగించాలి, ఏ సమయంలో బాస్లింగ్ చేపట్టాలి వంటి పలు అంశాలను తెలుపుతూ నిబంధనలతో కూడిన అనుమతులు ఇస్తారు. కానీ అక్రమార్కులు ఇవేమి పట్టించుకోకుండా ఇష్టారీతిన దందాను కొనసాగిస్తున్నారు.
పోలీసుల అనుమతి లేకుండా అక్రమంగా పేలుళ్లకు పాల్పడే వారిపై చట్టం ప్రకారం తీవ్ర చర్యలు తీసుకుంటాం. జిల్లాలో బ్లాస్టింగ్ జరిగే ప్రదేశాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. గతంలో పేలుళ్లకు పాల్పడిన వారిపై, సహకరించిన వారిపై నిఘా కొనసాగుతుంది. అనుమతి లేకుండా పేలుడు పదార్థాలు విక్రయించినా, నిల్వ చేసినా, రవాణా చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అక్రమంగా బ్లాస్టింగ్లకు పాల్పడితే స్థానిక పోలీసులకు గాని, డయల్100కు గానీ సమాచారం అందించాలి. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
– రాజేశ్ చంద్ర, డీసీపీ, యాదాద్రి భువనగిరి జోన్