ఆంగ్ల మాధ్యమం నిర్వహణతో ఆ పాఠశాల ముఖచిత్రమే మారిపోయింది. గతంలో విద్యార్థుల్లేక వెలవెలబోయిన పాఠశాల నేడు నాలుగింతలు పెరిగిన అడ్మిషన్లతో కళకళలాడుతున్నది. నిపుణులైన ఉపాధ్యాయులు, పైసాఖర్చు లేకుండా ఇంగ్లిష్ మీడియం బోధనతో విద్యార్థులు రాణిస్తున్నారు. ఆర్థిక భారం తొలగిపోవడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా ఆంగ్ల మాధ్యమంలో కొనసాగుతూ స్పష్టమైన మార్పును కళ్లకు కడుతున్నది.. బీబీనగర్ మండలంలోని ‘మక్తా అనంతారం’ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల.
ఏ గోడపై చూసినా పాఠ్యాంశాలే…
గ్రామీణ ప్రాంతం, పూర్తిగా ఆంగ్ల మాధ్యమాన్నే కొనసాగిస్తుండడంతో విద్యార్థులు ఆంగ్లంపై పట్టు సాధించేందుకు ఇక్కడి ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నారు. పాఠశాల హెచ్ఎం ఇంటర్ నుంచి డాక్టరేట్ వరకు ఆంగ్ల మాధ్యమంలోనే చదువడం, ఇద్దరు ఉపాధ్యాయులు ఇంగ్లిష్లో ఇన్సర్వీస్ ట్రైనింగ్ పొంది ఉండడం కూడా విద్యార్థుల బోధనకు కొంత దోహదపడింది. సైన్స్, మ్యాథ్స్కు సంబంధించిన అంశాలతోపాటు ఆంగ్ల పదాలు, స్వాతంత్య్ర సమరయోధుల జీవిత విశేషాలు, జాతీయ చిహ్నాలు తదితర వివరాలను రాయించడంతో తరగతి గదుల లోపల, బయట గోడలపై ఎక్కడ చూసినా సృజనాత్మకతను తట్టిలేపే పాఠ్యాంశాలే కనిపిస్తున్నాయి. ఫ్లకార్ట్స్, ఆట పాటలు తదితర వినూత్న పద్ధతుల్లో ఆంగ్లం బోధిస్తున్నారు. ఆంగ్లంలో సరళంగా మాట్లాడేందుకు సాయంత్రం వేళల్లో ఉపన్యాసాలు సైతం నిర్వహిస్తున్నారు.
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడి సారథ్యంలో…
పాఠశాలను ప్రగతి బాట పట్టించడంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు డాక్టర్ ఎస్వీ రామరాజు చొరవ చెప్పుకోదగ్గది. 2016 సంవత్సరంలో రాష్ట్రపతి భవన్లో జరిగిన ‘ఇన్సైడ్’ కార్యక్రమానికి రామరాజు ఎంపికయ్యారు. వారం రోజులపాటు రాష్ట్రపతి భవన్లో బస చేసే అవకాశం దేశవ్యాప్తంగా 12 మందికి కాగా అందులో రామరాజు ఒకరు. 2014 సంవత్సరంలో జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా అందుకున్నారు. ప్రస్తుతం పాఠశాలలో ఆరుగురు టీచర్లు పనిచేస్తున్నారు. పాఠశాలలో డిజిటల్ తరగతులను సైతం నిర్వహిస్తున్నారు. క్రీడా పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలతో విద్యార్థులను అన్నిరంగాల్లోనూ ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడి విద్యార్థులు రాష్ట్ర స్థాయిల్లో క్రీడా పోటీల్లోనూ, సైన్స్ ఫెయిర్లలోనూ ప్రతిభను కనబరుస్తున్నారు. ఈ పాఠశాల రాష్ట్రస్థాయిలో ఇచ్చే స్వచ్చ పురస్కారానికి సైతం ఎంపికైంది.
తల్లిదండ్రుల కలను సాకారం చేస్తున్నాం..
తమ పిల్లలకు ఆంగ్లం రావాలని ప్రతి తల్లిదండ్రులూ కోరుకుంటున్నారు. ఆ కలను ఏడేండ్ల నుంచే మేము మా పాఠశాలలో సాకారం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం అమలు చేస్తుండడం వల్ల ప్రభుత్వ పాఠశాలలు నూతన ఒరవడిని సృష్టిస్తాయి. పోటీ ప్రపంచంలో విద్యార్థులు రాణించాలంటే ఆంగ్లంపై పట్టు ఉండడం సాధారణం. మా పాఠశాలలో ప్రతి విద్యార్థి చదువడంతోపాటు, ఇంగ్లిష్లో మాట్లాడేలా ఉపాధ్యాయులమంతా సమష్టిగా కృషి చేస్తున్నాం.
ఫీజుల భారం తప్పింది..
మూడేండ్ల కిందటి వరకు నా ఇద్దరు పిల్లలు ప్రైవేటు స్కూల్లో చదివేవాళ్లు. ఇంగ్లిష్ మీడియం అన్న కారణంతోనే ప్రైవేటులో చేర్పించాను. అయితే, వచ్చే ఆదాయంతో ఇద్దరు పిల్లలను చదివించడం భారంగా మారింది. ఉన్న ఊర్లోనే ఇంగ్లిష్ మీడియం అందుబాటులోకి రావడంతో ఇద్దరు పిల్లల్ని యూపీఎస్ పాఠశాలలో చేర్పించాను. టీచర్లు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఇద్దరు పిల్లలూ ఆంగ్లంలో రాణిస్తుండడం సంతోషంగా ఉంది. ఫీజుల భారం కూడా తప్పింది.
ఇంగ్లిష్ అంటే భయం పోయింది..
నన్ను ఇంగ్లిష్ మీడియం చదివించాలని అమ్మానాన్నలకు ఉండేది. ఊళ్లో ఇంగ్లిష్ మీడియం బాగుండడంతో నన్ను ఇక్కడ చేర్పించారు. మొదట్లో కొంత భయం అన్పించినప్పటికీ రానురాను ఇంగ్లిష్ అంటే భయం పోయింది. అర్థంకాని విషయాలను ఆటపాటలతో టీచర్లు వివరిస్తున్నారు. స్కూల్లో మంచి చదువుతోపాటు పుస్తకాలు, బట్టలు అన్నీ ఉచితంగానే ఇచ్చారు.
ప్రైవేటులో చదివినట్లుగా ఉంది..
ప్రైవేటు పాఠశాలలో ఉన్నవన్నీ మా పాఠశాలలో ఉన్నాయి. టీచర్లు దగ్గరుండి సందేహాలను తీరుస్తున్నరు. ఇప్పుడు నేను ఇంగ్లిష్లో రాయడంతోపాటు, మాట్లాడగల్గుతున్న. నేను చదువుతున్నది ప్రభుత్వ పాఠశాలలోనైనా అలా అన్పించడం లేదు. ప్రైవేటు స్కూల్లో చదువుతున్నట్లుగానే ఉంది. చాలా సంతోషంగా చదువుకుంటున్నా.