Bondugula | వందల ఏండ్ల క్రితం నిర్మించిన కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఆయా గ్రామాల్లో నిజాం కాలం నాటి బురుజులు, మెట్ల బావులు ప్రత్యేక ఆకర్షణగా దర్శనమిస్తున్నాయి. రాజాపేట మండలంలోని జాల, పారుపల్లి, కుర్రారం, నెమిల, బొందుగుల, సోమారం గ్రామాల్లో నిజాం కాలంలో పూర్తిగా రాతితో కట్టిన బురుజులు నేటికీ చూడముచ్చటగా కన్పిస్తుండడం విశేషం.
బొందుగులలో వందల ఏండ్ల మెట్ల బావి
రాజాపేట మండలంలోని బొందుగుల గ్రామ శివాలయం ఆవరణలో ఉన్న వందల ఏండ్ల నాటి మెట్ల బావి నేటికీ చెక్కు చెదరకుండా దర్శనమిస్తూ నాటి నాణ్యత, సాంకేతికతకు అద్దం పడుతున్నది. పూర్తిగా రాతి కట్టడంతో అరుదుగా కనిపించే ఈ మెట్ల బావికి ప్రత్యేకత ఉంది. శివాలయం ఆవరణలో ఉన్న మెట్ల బావి అద్భుతమైన నిర్మాణ కౌశలంతో అలరారుతున్నది. మూడు గుంటల విస్తీర్ణంలో 20 గజాల లోతుతో బావి చుట్టూ భక్తులు దిగడానికి వీలుగా మెట్ల నిర్మాణం చేపట్టారు. నాడు ఆలయానికి వచ్చే భక్తులు ఇందులో స్నానమాచరించి శివలింగాన్ని దర్శించుకొని పూజలు చేసేవారట. స్నానాలు ఆచరించిన భక్తులు దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేక గదులను నిర్మించారు. బావిలో నడవడానికి అక్కడక్కడ ఖాళీ స్థలం వదిలి, చివరి వరకు వెళ్లడానికి మూడు వైపులా మెట్లను నిర్మించారు. ఈ మెట్ల నిర్మాణానికి పూర్తిగా సున్నం, రాయిని వాడారు. ఆలయం సమీప వాసులు ఈ బావి నీటిని ఇంటి అవసరాల కోసం వినియోగించుకునేవారని, మోటల ద్వారా పంట చేలకు కూడా వాడుకునేదని గ్రామ పెద్దలు చెప్తుంటారు.
నాటి చరిత్రకు సజీవ సాక్ష్యం
గ్రామ శివాలయం ఆవరణలో వందల ఏండ్ల నాటి పురాతన మెట్ల బావి నేటికీ చెక్కు చెదరకుండా ఉండడం విశేషం. ఈ బావి పూర్వ కాలంలో ప్రజల దాహర్తిని తీర్చడంతోపాటు పంటల సాగుకు నీరందించేదని గ్రామ పెద్దలు చెప్తుంటారు. వందల ఏండ్ల చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఇలాంటి బావులను సంరక్షించి మన ప్రాచీన వారసత్వ సంపదను కాపాడుకోవాలి.
– కిశోర్, శివాలయ అర్చకుడు, బొందుగుల
నాటి కట్టడాలు ఇప్పటికీ ఉన్నాయి
ఏండ్ల నాటి కట్టడాలు, బురుజులు, మెట్ల బావులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా గట్టిగా ఉన్నాయి. ఇవి గ్రామాల్లో చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. చరిత్రను చాటి చెప్పేలా నాటి కట్టడాలు నేటికీ మా ప్రాంతంలో దర్శనమిస్తుండడంతో ఎంతో ఆనందంగా ఉంది.
– డాక్టర్ బోగ జ్ఞానేందర్, రాజాపేట