నీలగిరి, జూలై 22 : గత కొంతకాలంగా కృష్ణ నది పరివాహక ప్రాంతంలో చేపల వ్యాపారం కోసం ఇతర ప్రాంతాల నుండి వ్యక్తులను అక్రమ రవాణా చేస్తున్న 8 మందితో కూడిన ముఠాను అరెస్టు చేసి, వెట్టి చేస్తున్న 36 మందికి విముక్తి కల్పించి వారి సొంత ప్రాంతాలకు తరలించినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో బాలల పరిరక్షణ కమిటీ, కార్మిక శాఖ అధికారులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆధిక మొత్తంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో మనుషులను అక్రమ రవాణా చేస్తూ, వారితో వెట్టి చాకిరి చేయిస్తూ ఎలాంటి జీతాలు ఇవ్వకుండా వాళ్లను భయానికి గురి చేస్తూ, పని వేళలు పాటించకుండా, చేపలు పట్టిస్తూ వెట్టి చాకిరి చేయిస్తున్న వ్యక్తుల చెర నుండి 32 మంది కార్మికులు, నలుగురు బాల కార్మికులు మొత్తం 36 మందిని రెస్క్యూ చేసినట్లు చెప్పారు.
పీఏ పల్లి మండలం బనాలకుంట గ్రామానికి చెందిన వడ్త్య జవహర్ లాల్, పాయతండాకు చెందిన రమావత్ రమేశ్, ఏపీలోని అనకాపల్లికి చెందిన మైలపల్లి శివ, కారే సింహాచలం, వంక విశాఖ అలియాస్ ఇషాక్, నేరేడుగొమ్ము మండలం వైజాక్ కాలనీకి చెందిన ఎరిపల్లి బాబుజీ అలియాస్ బావొజి, చాపల తాతారావు, చాపల బంగారిలు నాగార్జునసాగర్ లో చేపల వ్యాపారం చేస్తుంటారు. జవహర్ లాల్, రమేశ్, శివలు హైదరాబాద్కు చెందిన రాజు, జగన్ విజయవాడకు చెందిన వెంకన్న, లోకేశ్ను ఏజెంట్లుగా నియమించుకున్నారు. వీరు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, బిహార్, ఒడిశా రాష్ట్రాల నుండి హైదరాబాద్, విజయవాడ లాంటి ప్రాంతాలకు వలస వచ్చిన వారిని టార్గెట్గా చేసుకుని ఉపాధి కల్పిస్తామని నెలకు రూ.15 వేల జీతం, రోజుకి కేవలం 2 గంటల పని, ఉచిత ఆహారంతో పాటు మద్యం ఇస్తామని మాయ మాటలు చెప్పి ఇక్కడకు తీసుకు వస్తారని చెప్పారు. వారిని విజయవాడ, హైదరాబాద్ నుండి దేవరకొండలోని మల్లేపల్లికి పంపుతారని చెప్పారు. మల్లేపల్లిలో వీరిని ఇక్కడున్న చేపల వ్యాపారులు తమ వెంట తీసుకు వెళ్తారు. రాత్రి సమయంలో బైక్లపై బాణాలకుంట, వైజాక్ కాలనీలోకి తీసుకెళ్లి వారి వద్ద ఉన్న సెల్ఫోన్లు, ఆధార్ కార్డులు తీసుకుని కృష్ణా నదీలోని ఐలాండ్లకు పంపిస్తారని చెప్పారు.
ఎలాంటి సదుపాయాలు లేని ఐలాండ్లో కేవలం ప్లాస్టిక్ కవర్ ఇచ్చి అక్కడి నుండే చేపలు పట్టాలని ఆదేశిస్తారు. చుట్టూ నీరు ఉండడం వల్ల వారు తప్పించుకునే అవకాశం లేకుండా పోతుందన్నారు. ప్రతిరోజు వారిని చేపలు పట్టడం, చేపల వలలు లాగడం లాంటి పనులకు వినియోగిస్తారని చెప్పారు. కేవలం రెండు పూటలు మాత్రమే భోజనం అందిస్తారన్నారు. పని భారం ఎక్కువైందని, పనికి డబ్బులు ఇవ్వాలని కోరితే చిత్రహింసలు పెడుతూ వాతలు కూడా పెడతారని తెలిపారు. విజయవాడ, హైదరాబాద్లో ఏజెంట్లుగా ఉన్న రాజు, జగన్, లోకేశ్, వెంకన్న పరారీలో ఉన్నారని, త్వరలో అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. ఎవరితోనైనా వెట్టి చేయిస్తే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098, ఉమెన్ హెల్ప్ లైన్ నంబర్ 181, చైల్డ్ కేర్ వారికి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో దేవరకొండ ఏఎస్పీ మౌనిక, కార్మిక శాఖ అధికారి అరుణకుమారి, సీడబ్ల్యూసీ చైర్మన్ చింతకృష్ణ, బాలల పరిరక్షణ అధికారి కేసాని గణేశ్ గౌడ్, సీఐలు నవీన్, బీసన్న, ఎస్ఐలు దొరెపల్లి నర్సింహులు, నాగేంద్రబాబు సిబ్బంది పి.మహేశ్, ఆర్.రాజు, ప్రశాంత్, వై. నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
Nalgonda : మానవ అక్రమ రవాణా ముఠా అరెస్ట్.. 36 మందికి విముక్తి