యాదగిరిగుట్ట, మార్చి24 : యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. సెలవుదినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో వచ్చారు. మాఢవీధులు, క్యూలైన్లు, ప్రసాద విక్రయశాల, లక్ష్మీ పుష్కరిణి, కల్యాణకట్ట, సత్యనారాయణ వ్రత మండపాలు భక్తులతో కిటకిటలాడాయి. కొండకింద పార్కింగ్ వాహనాలతో నిండిపోయింది. స్వామివారి ధర్మదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పట్టిందని భక్తులు వెల్లడించారు.
స్వామి, అమ్మవార్లకు నిత్యారాధనలు శాస్ర్తోక్తంగా సాగాయి. తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు నిజాభిషేకం జరిపారు. స్వామివారికి తులసి సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామివారికి సహస్రనామార్చన నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో శ్రీవారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా భక్తులతో సువర్ణపుష్పార్చన జరిపించారు.
బంగారు పుష్పాలతో దేవేరులకు అర్చన చేశారు. ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహహోమం జరిపిన అర్చకులు ఉత్సవమూర్తులను ద్యివ మనోహరంగా అలంకరించి కల్యాణోత్సవ సేవను జరిపారు. సుమారు గంటన్నరకు పైగా జరిగిన కల్యాణ తంతును భక్తులు వీక్షించి తరించారు. సాయంత్రం స్వామివారికి తిరువీధి సేవ, దర్బార్ సేవను వైభవంగా చేపట్టారు.
రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు తిరువారాధన, సహస్రనామార్చనలు జరిగాయి. పాతగుట్టలోనూ స్వామివారికి నిత్యారాధనలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 45 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ. 55,38,896 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ తెలిపారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆలయ ఈఓ భాస్కర్రావు తెలిపారు. ఆదివారం స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తుల రద్దీ కారణంగా క్యూలైన్లు, ప్రసాద విక్రయశాలలను పర్యటించారు. స్వామివారి శ్రీఘ్ర దర్శనం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఆలయ డీఈఓ దోర్బల భాస్కర్ శర్మ, ఆలయ ఏఈఓలు ఉన్నారు.