యాదాద్రి, సెప్టెంబర్ 18: స్వయంభు నారసింహుడి దివ్యక్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ కొన సాగింది. మాడవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపంలో భక్తుల సందడి నెలకొన్నది. కొండకింద కల్యాణకట్ట వద్ద తలనీలాలు సమర్పించి, లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం స్వామివారి లడ్డూను కొనుగోలు చేశారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు జరిగే సువర్ణపుష్పార్చన, వేద ఆశీర్వచనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
బంగారు పుష్పాలతో ఉత్సవమూర్తిని అర్చించారు. భక్తుల గోత్రనామాల పేరిట సంకల్పం జరిపారు. స్వామి, అమ్మవార్ల నిత్యతిరుకల్యాణోత్సవం అత్యంత వైభవంగా సాగింది. తెల్లవారుజామన స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామివారికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం శ్రీసుదర్శన నారసింహహోమం నిర్వహించారు. సుదర్శన ఆళ్వారులకు కొలుస్తూ హోమం జరిపారు. అనంతరం మొదటి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణం వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్భార్ సేవలో పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు నిర్వహించారు. కొండకింద దీక్షాపరుల మండపం వద్ద గల వ్రత మండపంలో సత్యనారాయణ స్వామివారి వ్రత పూజలు జరిగాయి. కొండపై వేంచేసి ఉన్న పర్వతవర్దినీ సమేత రామలింగేశ్వరస్వామివారికి అర్చకులు, పురోహితులు అభిషేక పర్వాలు వైభవంగా నిర్వహించారు. స్వామివారిని ఆదివారం సుమారు 25,219 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అన్ని విభాగాల నుంచి స్వామివారి ఖాజానాకు రూ. 39,44,918 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు.