యాదగిరిగుట్ట, జనవరి 8 : పంచనారసింహుడి క్షేత్రం ఆదివారం భక్తులతో కోలాహలంగా మారింది. సెలవు దినం కావడంతో స్వయంభువుడి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో మాఢవీధులు, క్యూ కాంప్లెక్స్, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపంలోని క్యూలైన్లు భక్తులతో సందడిగా మారాయి. కొండపైకి వాహనాల రద్దీ కొనసాగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిత్య తిరుకల్యాణోత్సవం, సువర్ణ పుష్పార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు నిర్వహించే సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బంగారు పుష్పాలతో ఉత్సవమూర్తిని అర్చించారు. స్వామి, అమ్మవార్ల నిత్యతిరు కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వైభవంగా నిత్యోత్సవాలు
శ్రీవారి నిత్య తిరు కల్యాణోత్సవం శాస్ర్తోక్తంగా జరిపించారు. ఉదయం స్వామి వారికి సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అర్చకులు కల్యాణమూర్తులకు గజవాహన సేవ నిర్వహించారు. అనంతరం వెలుపలి ప్రాకార మండపంలో తూర్పునకు అభిముఖంగా స్వామి, అమ్మవార్లను వెంచేపు చేసి కల్యాణోత్సవం జరిపారు. సుమారు గంటన్నర పాటు సాగిన వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామి వారి నిత్యోత్సవాలు తెల్లవారుజాము నుంచే మొదలయ్యాయి. ఉదయం సుప్రభాత సేవతో స్వయంభువుడిని మేల్కొల్పిన అర్చకులు తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామి వారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేశారు.
సాయంత్రం స్వామి, అమ్మవార్లకు తిరువీధి సేవోత్సవం, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారి పారాయణదారులు పాశురాలను పఠించారు. తిరుప్పావై వేడుకులు ఘనంగా నిర్వహించారు. స్వామివారి ధర్మ దర్శనానికి 4 గంటలు, వీఐపీ దర్శనానికి 2 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామివారిని సుమారు 35వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.45,86,412 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశంగౌడ్
స్వయంభువుడిని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజేశంగౌడ్ కుటుంబసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఆలయ సంప్రదాయరీతిలో ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు వారికి వేదాశీర్వచనం చేయగా, అధికారులు స్వామివారి ప్రసాదం అందించారు.