యాదాద్రి, ఆగస్టు 7: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొన్నది. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణాన్ని తిలకించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు జరిగే సువర్ణపుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బంగారు పుష్పాలతో ఉత్సవమూర్తిని అర్చించారు. భక్తుల గోత్రనామాల పేరిట సంకల్పం జరిపారు. శ్రావణమాసంలో భాగంగా శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన వైభవంగా సాగుతున్నది. 10వ రోజులో భాగంగా అర్చకులు కుంకుమతో అర్చించారు. లక్ష్మీసహస్రనామార్చన నామాలను రుత్వికులు పఠించారు. లక్ష్మీనారసింహుడికి అర్చకులు నిత్యోత్సవాలను అత్యంత వైభవంగా జరిపారు.
తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయస్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం శ్రీసుదర్శన నారసింహ హోమం ఘనంగా జరిపారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. అనంతరం మొదటి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవాన్ని జరిపారు. సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు నిర్వహించారు. కొండ కింద దీక్షాపరుల మండపం వద్ద వ్రత మండపంలో సత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటంకంగా సాగాయి. కొండపైన వేంచేసి ఉన్న పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామికి అర్చకులు, పురోహితులు అభిషేక పర్వాలు నిర్వహించారు. అన్ని విభాగాలు కలుపుకుని స్వామివారి ఖజానాకు రూ.25,83,728 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
యాదాద్రీశుడి సేవలో ప్రముఖులు..
యాదాద్రీశుడి సేవలో హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నంద కుటుంబ సమేతంగా పాల్గొని తరించారు. ఉదయం స్వామివారి నిజాభిషేకంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం అద్దాల మండపం ప్రాంగణంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారులు స్వామివారి మహాప్రసాదాన్ని అందజేశారు. రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ బుద్దా మురళి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
స్వామివారికి వెండి కలశాల బహూకరణ
హైదరాబాద్కు చెందిన ముడుంబై జానకీదేవి లక్ష్మీనరసింహస్వామి వారికి రెండు వెండి కలశాలను బహూకరించారు. ఈ మేరకు ప్రధానాలయంలో ఆలయ అధికారులకు అందజేశారు. తన తల్లి కొడకండ్ల ఆండాళమ్మ జ్ఞాపకార్థం బహూకరించినట్లు ఆమె తెలిపారు.