కోదాడ రూరల్, డిసెంబర్ 18 : రాష్ట్ర ప్రభుత్వ చొరవతో గీత కార్మికుల రాత మారింది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిరాధరణతో కుల వృత్తులు ఆగమయ్యాయి. కుల వృత్తులను నమ్ముకున్న కొంతమంది వాటిని వదులుకుని కూలికి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. జీవనోపాధి కోసం వలస వెళ్లేవారు. ప్రత్యేక రాష్ట్ర సాధన అనంతరం సీఎం కేసీఆర్ కుల వృత్తిదారులకు ఎన్నో పథకాలను అమలు చేసి వారిలో మనోధైర్యం నింపారు. గతంలో కల్లు తీసే లైసెన్స్ రెన్యూవల్, రెంటల్ పేమెంట్ చెల్లించేందుకు గీత కార్మికులు రోజుల తరబడి ఎక్సైజ్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది. రెంటల్ విధానాన్ని కేసీఆర్ రద్దు చేసి ఆ పద్ధతికి స్వస్తి పలికారు. అదేవిధంగా తాటి, ఈత చెట్లపై పన్ను రద్దు చేసి, లైసెన్స్ల రెన్యూవల్ను 5 ఏండ్లకోసారి చేశారు. ఇటీవల దానిని 10 ఎండ్లకు ఒకసారి చేసుకోవాలని నిర్ణయించడంతో గీత వృత్తిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 6,515 మంది గీత కార్మికు లకు పింఛన్లు
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 23,511 మంది గీత కార్మికులు ఉన్నారు. ఇందులో 50 ఎండ్లు నిండిన 6,515 మంది గీత కార్మికులకు ప్రతి నెలా ప్రభుత్వం రూ. 2,016 చొప్పున పింఛన్ అందిస్తూ వారికి బాసటగా నిలుస్తున్నది. జిల్లా వ్యాప్తంగా 42,943 తాటి చెట్లు, 2,579 ఈత చెట్లు ఉన్నాయి. ఇటీవల ఎక్సైజ్, ఆటవీ శాఖ అధ్వర్యంలో జిల్లాలోని చెరువు గట్లు, చెరువు శిఖం భూములపై, మేజర్ కాల్వల వెంట తాటి, ఈత చెట్లు నాటించారు.
అమలవుతున్న సంక్షేమ పథకాలు..
గీత కార్మికులు ప్రమాదవశత్తు తాటిచెట్టుపై నుంచి కిందపడి మృతిచెందినా, శాశ్వత అంగవైకల్యం పొందినా, గత ప్రభుత్వాలు కేవలం రూ. 2 లక్షలు మాత్రమే అందించగా, నేడు స్వరాష్ట్రంలో గీత కార్మికులకు రూ. 5 లక్షల పరిహారం అందుతున్నది. గౌడ కులాల ఆస్తిత్వాన్ని చాటిచెప్పేందుకు సీఎం కేసీఆర్ అవకాశం ఉన్న చోట గౌడ సంఘం భవన నిర్మాణాలకు ఐదు ఎకరాల భూమి, నిధులు మంజూరు చేస్తున్నారు. ఈ విధంగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికుల సంక్షేమానికి పాటుపడుతున్నది.
గీత కార్మికులకు బీమా పెంచిన ప్రభుత్వం
జిల్లా వ్యాప్తంగా 23,511 మంది గీత కార్మికులు ఉన్నారు. ప్రభుత్వ నిబంధల మేరకు గీత కార్మికులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. వైన్షాపుల టెండర్లలోనూ జిల్లాలోని గీత కార్మికులకు రిజర్వేషన్లు కల్పించాం. ప్రభుత్వం బీమా పరిహారాన్ని రూ. 5 లక్షలకు పెంచి గీత కార్మికుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటున్నది.
– డీపీఈఓ అనిత
గీత కార్మికుల అభివృద్ధి ఘనత సీఎం కేసీఆర్దే..
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో గౌడన్నల అభివృద్ధికి పాటుపడిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుంది. గీత కార్మికల పన్ను రద్దు, ఎక్స్గ్రేషియా పెంచి వారి అభిమానాన్ని పొందారు. గీత వృత్తిదారులకు ఆర్థికాభివృద్ధికి వైన్షాపుల టెండర్లలోనూ రిజర్వేషన్లు కల్పించిన ఘనత వారిదే. గీత కార్మికల సంక్షేమానికిపాటు పడుతున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు.
– కేఎల్ఎన్ ప్రసాద్, రాష్ట్ర కౌండిన్య గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, గౌడ సంఘాల జేఏసీ అధికార ప్రతినిధి
ప్రభుత్వానికి అండగా ఉంటాం…
సీఎం కేసీఆర్ పాలనలో 50 ఎండ్లు నిండిన ప్రతి గీత కార్మికుడికీ నెల నెలా రూ. 2,016 పింఛన్ అందుతున్నది. చెట్ల పన్ను రద్దు చేసి గీత కార్మికులకు కేసీఆర్ దేవుడయ్యాడు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటాం.
– సోమగాని నారాయణ, గీతకార్మికుడు, లక్ష్మీపురం, కోదాడ