నల్లగొండ, జూలై 24 : బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస అల్ప పీడనాల ప్రభావం వల్ల ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే వారం రోజులుగా వర్షాలు కురుస్తుండగా మరో ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ఐదు రోజుల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో కురిసే వర్షాలను దృష్టిలో పెట్టుకోని వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్ను జారీ చేసింది. దాంతో ఈ ఐదు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేయగా ఎలాంటి ప్రాణ , ఆస్తి నష్టం సంభవించకుండా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నది. సోమవారం జిల్లావ్యాప్తంగా వర్షాలు కురువగా పలు మండలాల్లో భారీ వర్షం పడింది.
ఈ నెల 25న మూడు జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 26న నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేయగా యాదాద్రిలో మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 27న నల్లగొండ, సూర్యాపేటలో భారీ వర్షాలు (ఆరెంజ్), యాదాద్రిలో మోస్తారు (ఎల్లో) వర్షాలు పడనుండగా 28న ఒక్క యాదాద్రి జిల్లాలోనే మోస్తారు వర్షం(ఎల్లో) కురిసి ఆ తర్వాత వాతావరణం తేలిక పాటిగా మారనుందని వాతావరణ శాఖ తెలియచేసింది.
సోమవారం పలు ప్రాంతాల్లో వర్షం
నల్లగొండ జిల్లాలో సోమవారం ఉదయం కాస్త వాతావరణం తేలిక పాటిగానే ఉన్నప్పటికి మధ్యాహ్నం తర్వాత చోటుచేసుకున్న మార్పుల కారణంగా ఆయా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసాయి. ప్రధానంగా సాయంత్రం ఏడు గంటల తర్వాత వర్ష ప్రభావం తీవ్రంగా కనిపించింది. అయితే అత్యధికంగా మర్రిగూడలో 35.5 మి.మీ. వర్షం కురిసింది. త్రిపురారంలో 26.0, నల్లగొండలో 24.0, చిట్యాలలో 21.8, మునుగోడులో 21.3, నాంపల్లిలో 18.5, నార్కట్ పల్లిలో 16.8, కనగల్లో 16.5, గుర్రంపోడులో 15.3, కట్టంగూర్లో 14.5, చింతపల్లిలో 13.8, చండూరులో 12.5, కేతేపల్లిలో 12.5, మిర్యాలగూడలో 12.0, తిప్పర్తిలో 11.8, నిడమనూరులో 11.5, మాడ్గులపల్లిలో 11.3, శాలిగౌరారంలో 11.3, నకిరేకల్లో 11.0, దామరచర్లలో 10.3, పీఏపల్లిలో 8.5, అడవిదేవుల పల్లిలో 7.5, అనుములలో 6.3మిల్లీమీటర్ల వర్షం కురువగా మిగిలిన మండలాల్లో ఐదు మి.మీ.లోపు వర్షం పడింది.