మునుగోడు,జూన్13 : మునుగోడు మండలంలో శనివారం కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. మర్రివాగు ఉప్పొంగడంతో మునుగోడు చండూరు, చౌటుప్పుల్ రహదారుల మీదుగా వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బుడిగజంగాల కాలనీని వరద ముంచెత్తడంతో సుమారు రూ.2 లక్షల విలువైన ప్లాస్టిక్ సామగ్రి నీటి పాలైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాసీల్దార్ నేలపట్ల నరేశ్ వరద పరిస్థితిపై సమీక్షించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తం గా ఉండాలని సూచించారు.
ఈదురుగాలులతో భారీ వర్షం
మునుగోడు రూరల్, జూన్ 13: మునుగోడు మండల వ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా గాలి దుమారంతో భారీ వర్షం కురిసింది. పలు గ్రామాలకు వెళ్లే ఆర్అండ్బీ రహదారులపై వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో ఆయా గ్రామాలకు వెళ్లే జనం, వాహనదారులు రోడ్లపైనే పడిగాపులు పడాల్సి వచ్చింది. వర్షం వల్ల పత్తి రైతులకు మేలు చేకూరే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కాలంలో కురిసిన వర్షాల్లో ఇదే అతిపెద్దది. కోతులారం నుంచి పలివెలకు వెళ్లే రహదారిపై వరద నీరు ప్రవహించింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. వర్షాలు కురుస్తున్నందున గ్రామాల్లోని ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.