సూర్యాపేట, జనవరి 11 : ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే కంటి వెలుగుకు రెండ్రోజుల్లో ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ అధికారులను అదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కంటి వెలుగు కార్యక్రమంపై జిల్లా, మండలాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంద రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా షెడ్యూల్ సిద్ధం చేసుకోవాలన్నారు.
కంటి వెలుగు కోసం నియమించిన బృందాలన్నింటికీ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కంటి పరీక్షలను నాణ్యతతో చేయడం ముఖ్యమని చెప్పారు. రిజిస్ట్రేషన్, కంటి స్క్రీనింగ్ డేటా నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. పొరపాట్లు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కంటి వెలుగు శిబిరాన్ని ప్రతి వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు నిర్వహించాలన్నారు.
రోజువారి కార్యక్రమం పూర్తవగానే ఇన్వెంటరీ మాడ్యూల్లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. రానున్న ఐదు రోజుల్లో సిబ్బంది అన్ని పరికరాలు సరి చూసుకోవాలన్నారు. ప్రణాళికాబద్ధంగా రోజుకు 120 మందికి పరీక్షలు చేయవచ్చన్నారు. ప్రత్యేకాధికారులు సమన్వయం చేయాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతగా నిర్వహించాలన్నారు.
జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ : శ్వేతా మహంతి
ఏ చిన్న సమస్య వచ్చినా పరిష్కరించేందుకు జిల్లాస్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి అధికారులకు సూచించారు. ఏదైనా సమస్య తలెత్తితే శిబిర బృందం, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు అప్రమత్తమై సమస్యను పరిష్కరించాలన్నారు. బఫర్ సిబ్బంది, మెటీరియల్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కంటి పరీక్షలు చేసే పరికరాల్లో సమస్యలు తలెత్తితే అర గంటలో రిప్లేస్ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకోవాలని, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలన్నారు.
సిబ్బందికి సెలవులు రద్దు : శ్రీనివాస్రావు
కంటి వెలుగు కార్యక్రమం నేపథ్యంలో సిబ్బందికి సెలవులు మంజూరు చేయవద్దని వైద్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు జి.శ్రీనివాస్రావు తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమంలో రోజు వారీ ప్రజాసేవలకు ఆటంకం కలుగకుండా చూడాలన్నారు. ఎంసీహెచ్, ఎన్పీడీ, ఇమ్యూనైజేషన్ తదితర సేవలు ఆగకూడదన్నారు. సమావేశంలో కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, అదనపు కలెక్టర్ మోహన్రావు, టీఎస్ఎంఐ డీసీఎం చంద్రశేఖర్రెడ్డి, డీఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.