భూదాన్పోచంపల్లి చేనేత కళాకారులు రూపొందించిన కళాఖండాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిదా అయ్యారు. అబ్బురపరిచే విభిన్న చేనేత చీరల అందాలను చూసి ఆమె మంత్ర ముగ్ధులయ్యారు. పెవిలియన్ థీమ్ పేరుతో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లను సందర్శించి అభినందించారు. రాష్ట్రపతి బుధవారం భూదాన్ పోచంపల్లిలో పర్యటించారు. సుమారు రెండు గంటలకు పైగా ఇక్కడే గడిపారు. అనంతరం సభకు హాజరై ప్రసంగించారు. పదే పదే చేనేత రంగాన్ని, పోచంపల్లి చీరలను ప్రశంసించారు. తెలంగాణ చీరల ప్రఖ్యాతిని మెచ్చుకున్నారు. చేనేత వారసత్వాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.
-యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ)/భూదాన్పోచంపల్లి
తెలంగాణ చేనేత ఔన్నత్యం ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన పేవిలియన్ థీమ్ను రాష్ట్రపతి సందర్శించారు. నూలు నుంచి వస్త్ర ఉత్పత్తి పరిణామక్రమాన్ని తెలియజేసే చేనేత స్టాళ్లను పరిశీలించారు. ఇందులో పోచంపల్లి ఇక్కత్, పుట్టపాక తేలియా రుమాళ్లు, ముచ్చపేట, నారాయణపేట, గద్వాల చీరలు, సిద్దిపేట గొల్లబామ చీరలతో స్టాళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి స్టాల్ను ఆమె క్షుణ్నంగా తిలకించారు. ఆయా చీరల ప్రత్యేకత, గొప్పదనాన్ని అధికారులు ఆమెకు వివరించగా శ్రద్ధగా విన్నారు. ఇక్కడే చేనేత మగ్గం నేసే విధానం తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన మగ్గాలను పరిశీలించారు. అదే విధంగా పదుల సంఖ్యలో మహిళలు చరఖా వడకడం ఆమెను ఆకట్టుకున్నది.
ఈ సందర్భంగా వారి మధ్యలో నిల్చొని ప్రత్యేకంగా ఫొటో దిగారు. అనంతరం భూదాన ఉద్యమకారుడు వినోబాబావే చిత్రపటానికి రాష్ట్రపతి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వినోబాబావే ఫొటో ఎగ్జిబిషన్ తిలకించారు. భూదాన ఉద్యమం గొప్పదనాన్ని అధికారులు వివరించారు. అనంతరం వేదిక వద్దకు చేరుకున్నారు. వేదికను రాష్ట్రపతితోపాటు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, సీతక్క, కేంద్ర జౌళి శాఖ సెక్రటరీ రచన షా, రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్ పంచుకున్నారు. సభా వేదికపై చేనేత రంగంలో కృషి చేస్తున్న అవార్డు గ్రహీతలు భోగ సరస్వతి, లోక శ్యామ్కుమార్, కూరపాటి వెంకటేశం చేనేత రంగంపై తమ అనుభవాలను పంచుకున్నారు.
శీతాకాల విడిదిలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం పర్యటించారు. షెడ్యూల్ సమయం కంటే పది నిమిషాల ముందే 10:28 గంటలకు మూడు ప్రత్యేక ఆర్మీ విమానాల్లో పోచంపల్లికి చేరుకున్నారు. పోలీస్స్టేషన్ పక్కనే ఏర్పాటు చేసిన హెలిప్యాడ్లో రాష్ట్రపతి ల్యాండ్ అయ్యారు. ఆమెకు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, అనసూయ సీతక, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి, కేంద్ర జౌళి శాఖ కార్యదర్శి రచన షా, కలెక్టర్ హనుమంతు కె.జెండగే ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి తొలుత భారీ కాన్వాయ్తో శ్రీ రంజన్ సిల్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ కంట్రోల్ యూనిట్స్ను సందర్శించారు. అక్కడ దారం తయారీ నుంచి వస్త్రం తయారు చేసే ప్రక్రియను పరిశీలించారు. పట్టుగూళ్ల నుంచి పట్టు తీయం, ఆసు పోయడం, రంగులు అద్దడం, చిటికీ తిప్పడం, చీరలు నేయడం తదితర వాటిపై అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రపతి షెడ్యూల్లో పలు మార్పులు జరిగినట్లు అధికారులు చెప్పారు. వాస్తవానికి పట్టణంలోని టూరిజం సెంటర్, ఆచార్య వినోబా భావే భవనానికి వెళ్తారని భావించారు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఎంపిక చేసిన నాలుగు చేనేత కుటుంబాలు, మాస్టర్ వీవర్, విక్రయదారుల ఇండ్లకు వెళ్తారని అనుకున్నారు. ఇక్కడ చేనేత వృత్తి, చీర తయారీ విధానం, వారి స్థితిగతులు, మార్కెటింగ్ గురించి తెలుసుకుంటారని భావించారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు. కానీ చివరగా రాష్ట్రపతి షెడ్యూల్లో శ్రీరంజన్, బాలాజీ ఫంక్షన్ హాల్ కార్యక్రమాలు మాత్రమే ఉండటంతో మిగతా వాటిని రద్దు చేశారు.
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. వీఐపీలకు రెస్ట్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఫంక్షన్ హాల్లో అన్ని చోట్ల షామియానాలు వేశారు. సభప్రాంగణానికి చేరుకోవడానికి రాష్ట్రపతి కోసం ప్రత్యేక ద్వారం, ఇతర వీఐపీలు, కార్మికులు వచ్చేందుకు వేర్వేరు ద్వారాలు ఏర్పాటు చేశారు. చేనేత వైభవం ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు, చేనేత చీరల డిజైన్ల ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగానిలిచాయి.
భారత ప్రథమ పౌరురాలు పర్యటన నేపథ్యంలో పోలీసు బలగాలు గట్టి చర్యలు చేపట్టాయి. పోచంపల్లిని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఐదెంచల వ్యవస్థను అమలు చేశాయి. అడుగడుగునా పోలీస్ నిఘా ఉంచాయి. బాంబ్స్వాడ్, డాగ్ స్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. పదుల సంఖ్యలో మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేశారు. పాస్లు ఉంటేనే లోపలికి అనుమతించారు. భద్రతా కారణాల రీత్యా పెన్నులు, కీ చైన్లు, ఫోన్లు లోపలికి అనుమతించలేదు. సీపీ సుధీర్బాబు, డీసీపీ రాజేశ్చంద్ర ఏర్పాట్లను పరిశీలించారు.