త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ను గురువారం ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఇదే రోజు తొలి ఏకాదశి కావడంతో ఆలయాల్లో హిందువులు వేడుకలకు సిద్ధమయ్యారు. ప్రార్థనలు, పూజలతో నేడు ఆధ్యాత్మిక సందడి కనిపించనున్నది. బక్రీద్ సందర్భంగా ముస్లింలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
– రామగిరి, జూన్ 28
నల్లగొండ రూరల్, జూన్ 28 : మాజీ ప్రధాని పీవీ.నర్సింహారావు ఆర్థిక సంస్కరణలతో దేశాభివృద్ధికి విశేష కృషి చేశారని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కొనియాడారు. మాజీ ప్రధాని పీవీ జయంతిని పురస్కరించుకుని నల్లగొండలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో జన్మించి దేశానికి ప్రధాని అయిన గొప్ప నేత పీవీ అని పేర్కొన్నారు. నాడు గొప్ప సంస్కరణలు తేవడం వల్లే ప్రస్తుతం భారతదేశం అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పీవీ పేరు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిందన్నారు. రాజధాని నగరం నడిబొడ్డున ఆయన విగ్రహాం ఆవిష్కరించడం జరిగిందని, త్వరలోనే నల్లగొండ పట్టణంలో సైతం ఆవిష్కరిస్తామని తెలిపారు. పీవీని స్ఫూర్తిగా తీసుకొని యువత ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, కనగల్ జడ్పీటీసీ చిట్ల వెంకటేశం, కౌన్సిలర్ యామ కవితాదయాకర్, బీఆర్ఏస్ నాయకులు ఐతగోని స్వామి, గోపాల్రెడ్డి, వెంకటేశ్వర్రావు ,యాదయ్య, హరికృష్ణ, మునాసు వెంకన్న పాల్గొన్నారు.
బక్రీద్ శుభాకాంక్షలు
రామగిరి : బక్రీద్(ఈదుల్ అజ్హా) పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ భక్తి, త్యాగం, కరుణ, విశ్వాసం అనే గొప్ప గుణాలను ప్రజల్లో పెంపొందిస్తుందని పేర్కొన్నారు. హిందూ, ముస్లింలు సోదరభావంతో జీవిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తూ అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తుందని లిపారు. పవిత్ర బక్రీద్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ముస్లింలకు సూచించారు.
బక్రీద్ను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి
సూర్యాపేట టౌన్, జూన్ 28 : నేడు బక్రీద్ పండుగను పురస్కరించుకుని ముస్లింలకు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకైన బక్రీద్ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. విశ్వాసాలు, సంప్రదాయాలకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నదని తెలిపారు.