కేజీ టు పీజీ విద్య ముఖ్యమంత్రి కల అని, ఆ కలకు ప్రతిరూపమే రాష్ట్రంలో 1,150 గురుకుల జూనియర్ కళాశాలల ఏర్పాటు అని విద్యా శాఖ మంత్రి పటోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా నకిరేకల్ మండలం నోముల జడ్పీహెచ్లో రూ.1.6కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు బుధవారం ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం నకిరేకల్ మినీ స్టేడియంలో చిరుమర్తి చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నియోజకవర్గస్థాయి కబడ్డీ పోటీల ముగింపులో పాల్గొన్నారు. ఫైనల్ మ్యాచ్ను తిలకించి విజేత జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. పేద, మధ్యతరగతి వర్గాలకు గుణాత్మక విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడైనా పోటీ పడేందుకు వీలుగా ఇంగ్లిష్ మీడియం బోధిస్తున్నట్లు గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల బాలబాలికలకు నియోజకవర్గస్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
నకిరేకల్, జనవరి 11 : కేజీ టు పీజీ విద్య ముఖ్యమంత్రి కేసీఆర్ కల అని, దానికి ప్రతిరూపమే 1150 గురుకుల జూనియర్ కళాశాలల ఏర్పాటని విద్యాశాఖ మంత్రి పటోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. నకిరేకల్ పట్టణంలోని మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదన్నారు. పేద, మధ్యతరగతి వర్గాలకు గుణాత్మక విద్యను అందించేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో 1000గురుకులాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఒక్కో విద్యార్థిపై రూ.1.20లక్షలు ఖర్చు చేస్తూ ప్రైవేట్కు దీటుగా అన్ని హంగులతో విద్యను అందిస్తున్నదన్నారు. పదో తరగతి అనంతరం విద్యనభ్యసించేందుకు రాష్ట్రంలో 1150 గురుకుల జూనియర్ కళాశాలలు, 85 డిగ్రీ కళాశాలలు, రెండు పీజీ కళాశాలలు ఏర్పాటు చేసిందన్నారు.
తెలంగాణ విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడైనా పోటీపడేందుకు వీలుగా 1నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం బోధిస్తున్నట్లు తెలిపారు. చిరుమర్తి చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల బాలబాలికలకు నియోజకవర్గస్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో క్రీడాపాలసీ రూపొ ందించేందుకు సబ్ కమిటీని సీఎం కేసీఆర్ నియమించారని, సబ్ కమిటీ రిపోర్టు త్వరలో సమర్పిస్తుందన్నారు. అన్ని పాఠశాలల్లో పీఈటీలు ఉండేలా చూస్తామన్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ చిరుమర్తి చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజవకర్గస్థాయి క్రీడలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
అన్ని పాఠశాలల్లో చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చేలా విద్యాధికారులతో మాట్లాడుతామన్నారు. క్రీడలకు కావాల్సిన కిట్లను ప్రతి పాఠశాలకు అందించేలా కృషి చేస్తామన్నారు. మూడ్రోజుల క్రీడాపోటీల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి ఎనలేనిదన్నారు. అనంతరం విజేతలకు మంత్రి సబితాఇంద్రారెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్లు బండా నరేందర్రెడ్డి, సందీప్రెడ్డి, కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఫిష్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, డీఈఓ భిక్షపతి, పంచాయతీరాజ్ ఈఈ తిరుపతయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ముజీబుద్దీన్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
బాలుర విభాగంలో నకిరేకల్ జడ్పీహెచ్ఎస్, నకిరేకల్ ఏవీఎం ఎయిడెడ్ స్కూల్, బాలికల విభాగంలో కట్టంగూర్ జడ్పీహెచ్ఎస్, తాటికల్ జడ్పీహెచ్ఎస్ టీంలు ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించాయి.
లక్ష్మీనరసింహ స్వామికి ప్రత్యేక పూజలు
నకిరేకల్ మండలంలోని పాలెం గ్రామంలో గల లక్ష్మీనరసింహ స్వామిని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్ది బుధవారం దర్శించారు. ముందుగా ఆమెకు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నోముల గ్రామంలో మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా జడ్పీహెచ్ఎస్లో చేపడుతున్న అదనపు తరగతి గదుల నిర్మాణం, తాగునీటి సరఫరా, విద్యుత్ పనులు, డైని ంగ్ హాల్, బాలికల టాయిలెట్, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.