నీలగిరి, ఫిబ్రవరి 02 : నల్లగొండ జిల్లా గుర్రంపోడ్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహమ్మద్ అబ్దుల్ హకీమ్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. సర్వే నెం. 225/6లఓ 1.15 ఎకరాల భూమికి సంబంధించిన తొలగించబడిన వివరాలను ఆన్లైన్ 1-8 రిజిస్టర్ (ROR) నుండి పునరుద్ధరించడానికి, ఫిర్యాది దరఖాస్తును అలాగే సంబంధిత ఫైల్ను తాసీల్దార్కు ప్రాసెస్ చేసి పంపడం కోసంగా రూ.2,20,000 లంచం డిమాండ్ చేశాడు. సోమవారం తాసీల్దార్ కార్యాలయ ఆవరణలో రూ.20 వేలు లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు నిందిత అధికారిని హైదరాబాద్లోని ఎస్పీఈ & ఏసీబీ కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన మొదటి అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరుచనున్నారు.
ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తే, చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ప్రజలు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు సంప్రదించాలని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లైన వాట్సాప్ (9440446106), ఫేస్బుక్ (Telangana ACB), X/గతంలో ట్విట్టర్ (@Telangana ACB) ద్వారా కూడా సంప్రదించవచ్చన్నారు. బాధితుడు/ఫిర్యాది పేరు, వివరాలు గోప్యంగా ఉంచబడతాయని వారు పేర్కొన్నారు.