నల్లగొండ ప్రతినిధి, డిసెంబర్16 (నమస్తే తెలంగాణ) : నల్లగొండ జిల్లాలో నూతనంగా మరో 24 గ్రామ పంచాయతీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. పలు మండలాల్లోని స్థానికుల డిమాండ్ మేరకు అప్పట్లోనే కేసీఆర్ సర్కార్ నూతన పంచాయతీల ఏర్పాటు కోసం ప్రతిపాదనలను స్వీకరించింది. ఈ మేరకు గత ఆగస్టులో దాదాపు నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుపై కసరత్తు పూర్తి చేశారు. ఈ మేరకు రానున్న ఎన్నికల్లో నూతనంగా ఏర్పాటవుతున్న
గ్రామ పంచాయతీల్లోనూ ఎన్నికల నిర్వహణ కోసం వివరాలను సేకరిస్తున్నారు. జిల్లా పంచాయతీ అధికారులు ఈ వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేసినట్లు తెలిసింది. ఈ వివరాల ప్రకారం జిల్లాలో మొత్తం 24 నూతన గ్రామ పంచాయతీల్లోనూ ఎన్నికలు జరుగనున్నాయి. చందంపేట మండలంలో బండమీదితండా, నల్లచెలమొల్ల, చింతపల్లి మండలంలో అనాజీపురం, బాలాజీ తండా, దేవరకొండ మండలంలో గొల్లపల్లి, గిరిజనగర్తండా, డిండి మండలంలో కటికబండతండా, కొండమల్లేపల్లిలో పకీరుపురం, నేరడుగొమ్ము మండలంలో సుద్దబావితండా.
జోడుబావితండా, పీఏపల్లి మండలంలో పోతిరెడ్డిపల్లి, సింగరాజుపల్లి, రంగారెడ్డిగూడెం, మాదారిగూడెం, గడ్డమీదితండా, పిల్లిగుండ్లతండా, మునుగోడు మండలంలో బీరెల్లిగూడెం, కాశవారిగూడెం, అనుముల మండలంలో కుపాస్పల్లి, కాశివారిగూడెం, గుర్రంపోడు మండలంలో కట్టవారిగూడెం, పెద్దవూర మండలంలో పుల్యాతండా, సంగారం, తిరుమలగిరిసాగర్ మండలంలోని చెంచువాని తండాలు నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు కానున్నాయి. రానున్న పంచాయతీ ఎన్నికల అనంతరం ఈ గ్రామాల్లో నూతన పాలక వర్గాల ఆధ్వర్యంలో పాలన వ్యవహారాలు కొనసాగనున్నాయి.