యాదాద్రి, సెప్టెంబర్ 25 : యాదాద్రి దివ్యక్షేత్రంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వామివారికి నిజాభిషేకం, తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు ఉదయం సుదర్శన నారసింహ హోమం ఘనంగా నిర్వహించారు. సుదర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం చేశారు. అనంతరం మొదటి ప్రాకార మండపంలో స్వామి, అమ్మవార్ల నిత్య తిరుకల్యాణోత్సవం ఘనంగా జరిపించారు.
సాయంత్రం వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో ఆర్జిత పూజలు ఘనంగా నిర్వహించారు. కొండకింద దీక్షాపరుల మండపం వద్ద గల వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు నిర్వహించే సువర్ణ పుష్పార్చన, వేదాశీర్వచనంలో భక్తులు పాల్గొన్నారు. బంగారు పుష్పాలతో ఉత్సవమూర్తిని అర్చించారు. భక్తుల గోత్రనామాల పేరిట సంకల్పం జరిపారు. కొండపై వేంచేసి ఉన్న పర్వతవర్దినీ సమేత రామలింగేశ్వర స్వామికి అర్చకులు, పురోహితుల అభిషేక పర్వాలు ఘనంగా నిర్వహించారు. స్వామిని సుమారు 12,702మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.15,49,005 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.
నేటి నుంచి దేవీ శరన్నవరాత్రోత్సవాలు
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ప్రధానాలయంలో సోమవారం నుంచి దేవీ శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభంకానున్నాయి. అక్టోబర్5(దసరా)వరకు ఉత్సవాలు శాస్ర్తోక్తంగా నిర్వహిస్తామని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు.