యాదాద్రి, జూన్ 9 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో అర్చకులు నిత్య పూజలు గురువారం శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించి తులసీ దళాలతో అర్చించి అష్టోత్తర పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ప్రధానాలయ ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం, నిత్య తిరుకల్యాణోత్సవం జరిపించారు.
కొండపైన గల పర్వతవర్ధిణి రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన చేశారు. రాత్రి ప్రధానాలయ ముఖ మండపంలో ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన చేశారు. ఆలయంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. అన్ని విభాగాలు కలుపుకొని స్వామివారి ఖజానాకు రూ.18,07,407 ఆదాయం సమకూరిందని ఆలయ ఇన్చార్జి ఈఓ రామకృష్ణారెడ్డి తెలిపారు. పాతగుట్ట ఆలయంలో స్వామివారి నిత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు.