యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా ముగిశాయి. మొత్తం 30,192 మంది రైతుల నుంచి ప్రభుత్వం 2,53,434 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇప్పటికే 542.15 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఎలాంటి సమస్యల్లేకుండా ధాన్యం సేకరణ సాధ్యమైందని నమస్తే తెలంగాణతో ఇంటర్వ్యూలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) భాస్కర్రావు
పేర్కొన్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. వానకాలం సీజన్కు సంబంధించి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పోటెత్తింది. వచ్చిన ధాన్యం వచ్చినట్లు కొనుగోలు చేశాం.
జి ల్లాలో గురువారంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసేశాం. మొత్తం 30,192 రైతుల నుంచి 2,53,434 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం. ఇందులో ఏ-గ్రేడ్, సాధారణ రకం ధాన్యం ఉంది. ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాం. ఖాతాల్లో రూ.542.15 కోట్లు జమ రైతుల నుంచి ధాన్యం సేకరణతోపాటు వెంటవెంటనే ధాన్యం డబ్బులను అన్నదాతల ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకున్నాం. అన్నదాతకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించింది. జిల్లాలో రూ.556.56 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటికే రూ. 542.15 కోట్లు వారి ఖాతాల్లో జమ అయ్యాయి. ఇంకా రూ.14.41 కోట్లు చెల్లించాల్సి ఉంది. అవి కూడా అతి త్వరలోనే జమ అవుతాయి. పకడ్బందీ కార్యాచరణతోనే సాధ్యం.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాం. పక్కా వ్యూహం, పకడ్బందీ కార్యాచరణ రూపొందించాం. అధికారులు, సిబ్బందితో ఎప్పటికప్పుడు సమీక్షలు, సమావేశాలు నిర్వహించాం. అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లడంతో సాఫీగా ధాన్యం సేకరణ సాధ్యమైంది. క్షేత్రస్థాయిలోకి వెళ్లి పర్యవేక్షించాం. మధ్యలో వర్షం ముప్పు ఉన్నా ముందస్తుగా గట్టి చర్యలు తీసుకున్నాం. సకాలంలో ధాన్యం కొనుగోళ్లు జరిగేలా సఫలీకృతమయ్యాం. ఇప్పటికీ 63,20,000 గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా అన్నదాతకు మద్దతు ధర లభించడం సంతోషంగా ఉంది.