పెద్దవూర, డిసెంబర్ 21 : వానకాలం ధాన్యం కొనుగోళ్లు పెద్దవూర మండలంలో ముమ్మరంగా సాగుతున్నాయి. మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 1010 రకం వడ్లను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయగా ప్రస్తుతం సన్న రకాలను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 15,208 కిటాళ్లు కొనుగోలు చేసి వాటికి సంబంధించిన డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేశారు. 8,500 క్వింటాళ్ల సన్నరకం ధాన్యం కొనుగోలు చేశారు. ఇంకా మార్కెట్లో 13వేల క్వింటాళ్ల సన్నరకం ధాన్యం కొనుగోలుకు సిద్ధంగా ఉంది. తేమశాతం 17 రాగానే వాటిని కొనుగోలు చేస్తామని మార్కెట్ అధికారులు తెలిపారు.
కొనసాగుతున్న వరి కోతలు
మండలంలో ఎక్కువగా బోరు బావుల కింద వరిసాగు చేశారు. మొత్తం 12,500 ఎకరాల్లో వరిసాగు చేయగాఅందులో 750 ఎకరాల్లో దొడ్డురకం, మిగతావి సన్నరకం సాగు చేశారు. దొడ్డు రకం ధాన్యం కోతలు, కొనుగోళ్లు పూర్తయ్యాయి. సన్న రకాల్లో ఆలస్యంగా సాగు చేసిన వారు ప్రస్తుతం కోతలు కోస్తున్నారు. ధాన్యం పూర్తిగా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మార్కెట్ అధికారులు స్పష్టం చేశారు.