మునుగోడు, జనవరి 1 : అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని రాష్ట్ర సర్కారు చివరి గింజ వరకూ కొనుగోలు చేసింది. మునుగోడు మండలంలో 10 కొనుగోలు కేంద్రాల ద్వారా 1,40,488 క్వింటాళ్ల ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసింది. దాంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఓపీఎంఎస్ ద్వారా…
రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చింది. ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టం(ఓపీఎంఎస్)ద్వారా గ్రేడ్-ఏ రకం ధాన్యానికి క్వింటాల్కు రూ.1,960, సాధారణ రకానికి రూ.1,940 చొప్పున కనీస మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసి నేరుగా రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నది. జిల్లా అధికారుల నిరంతర పర్యవేక్షణతో ధాన్యం కొనుగోళ్లు వేగంగా పూర్తయ్యాయి. సరిపడా లారీలు, గోనె సంచులను అందుబాటులో ఉంచడంతోపాటు సేకరించిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.
పీఏసీఎస్ ఆధ్వర్యంలో…
పీఏసీఎస్ ఆధ్వర్యంలో మునుగోడు, గూడపూర్, ఊకొండి, చీకటిమామిడి గ్రామాల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 1,503 మంది రైతుల నుంచి 66,770 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు 1,050 మంది రైతుల ఖాతాల్లో రూ.9.57 కోట్ల సొమ్మును జమచేశారు. ఇంకా 453 మంది రైతులకు రూ.4 కోట్లు చెల్లించాల్సి ఉంది.
ఐకేపీ ద్వారా…
ఐకేపీ ఆధ్వర్యంలో కొరటికల్, బీరెల్లిగూడెం, కొంపల్లి, పులిపలుపుల, పలివెల, గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల ద్వారా 1,631 మంది రైతుల నుంచి 73,718.80 క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు జరిగాయి. ఇప్పటి వరకు 986 మంది రైతుల ఖాతాల్లో రూ.9.65 కోట్లు జమచేయగా.. 645 మందికి రూ.4.79 కోట్లు చెల్లించాల్సి ఉన్నది.
రైతు పక్షపాతి సీఎం కేసీఆర్
రైతులు పండించిన చివరి గింజ వరకూ టీఆర్ఎస్ సర్కారు కొనుగోలు చేయడం హర్షణీయం. ధాన్యాన్ని దళారులకు అమ్ముకొని నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఓపీఎంఎస్ విధానం ఇతర రాష్ర్టాలకూ ఆదర్శంగా నిలిచింది. అహర్నిషలు అన్నదాతల సంక్షేమం కోసం పనిచేస్తున్న సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా నిలిచారు.
-ఎల్లంకి యాదగిరిగౌడ్,ఉప సర్పంచ్, కొరటికల్
వారం రోజుల్లో జమ చేస్తాం
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాం. రైతులు తీసుకొచ్చిన ప్రతి గింజనూ కొనుగోలు చేశాం. ఇప్పటికే పలువురు రైతుల ఖాతాల్లో సొమ్ము జమచేశాం. మిగతా వారికి వారం రోజుల్లో జమచేస్తాం.
-పాలకూరి సుఖేందర్, సీఈఓ, మునుగోడు పీఏసీఎస్