యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ) హైవేలపై ప్రయాణించే వాహనదారులు టోల్ గేట్ల వద్ద చెల్లించే టోల్ ఫీజు కొత్త విధానంలో అమల్లోకి రానున్నది. ఇప్పుడున్న ఫాస్టాగ్ సిస్టమ్కు స్వస్తి పలికి.. జీపీఎస్ ఆధారిత శాటిలైట్ విధానం తీసుకురానున్నారు. దాంతో టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ సమస్య తగ్గడంతోపాటు రహదారులపై ప్రయాణించిన దూరానికే టోల్ చెల్లించే వెసులుబాటు కలుగనున్నది. అంతే కాకుండా కొత్త జీపీఎస్తో కొంత దూరం వరకు ఇప్పుడు ఉచితంగా ప్రయాణిస్తున్న అవకాశం లేకుండా పోనున్నది. ఈ తరహా విధానంలో ఈ నెలలోనే అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మారుతున్న కాలంతోపాటు ప్రజానీకానికి కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్నది. మూస పద్ధతులకు ఫుల్స్టాప్ పెడుతూ.. అద్భుతమైన సాంకేతిక చేరువవుతున్నది. 2019 కంటే ముందు టోల్ప్లాజాల వద్ద నగదు రూపంలోనే టోల్ చార్జీలు వసూలు చేసేవారు. ఆ తర్వాత ఫాస్టాగ్ విధానం అందుబాటులోకి వచ్చింది. వాహనాలు టోల్ బూత్ వద్దకు రాగానే క్షణాల్లోనే పేమెంట్ జరుగుతున్నది. ప్లాజాల వద్ద ఉన్న సెన్సార్లు ఫాస్టాగ్ను స్కాన్ చేసుకోవడం ద్వారా చెల్లింపులు కొనసాగుతున్నాయి. దీని ద్వారా టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గింది. ఫాస్టాగ్ లేకుంటే నగదు ద్వారా రెండింతలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం యదాద్రి జిల్లాలో రెండు టోల్ ప్లాజాలు ఉన్నాయి. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై బీబీనగర్ మండలంలోని గూడూరు వద్ద, హైదరాబాద్-విజయవాడ రహదారిపై చౌటుప్పల్ మండలంలోని పంతంగి వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి.
ప్రస్తుతం ఉన్న ఫాస్టాగ్ విధానానికి కేంద్రం స్వస్తి పలుకనున్నది. దాని స్థానంలో జీపీఎస్ ఆధారిత టోల్ చార్జ్లను అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే దేశంలోని పలు చోట్ల పైలెట్ ప్రాజెక్ట్గా అమలు చేస్తున్నది. ఈ నెల నుంచి దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని ఇప్పటికే కేంద్ర రవాణా శాఖ మంత్రి నితీన్ గడ్కరీ స్పష్టం చేశారు. కొత్త విధానం ప్రకారం వాహనం ప్రయాణించిన దూరం ఆధారంగానే టోల్ చెల్లించాలి. సదరు వాహ నం ఎన్ని టోల్ ప్లాజాలు దాటిందో ఈ జీపీఎస్ వ్యవస్థ నమోదు చేస్తుంది.
దాని కోసం వాహనంలో ఓ డివైస్ అమర్చుకోవాలి. దీని ఆధారంగా వాహనం కదలికను ట్రాక్ చేస్తారు. రహదారి ఎగ్జిట్ పాయింట్కు చేరుకోగానే ప్రయాణించిన దూరాన్ని బట్టి టోల్ ఫీజు కట్ అవుతుంది. రహదారులపై ప్రయాణించే దూరాన్ని బట్టి టోల్ చెల్లించే విధానం ప్రస్తు తం అందుబాటులో లేదు. వాహనదారులు ఫిక్స్డ్ టోల్ కడుతున్నారు. తక్కువ దూరం ప్రయాణించినా టోల్ప్లాజా దాటితే మొత్తం రుసుము చెల్లించాల్సి వస్తున్నది. జీపీఎస్ టోల్ విధానంలో వాహనదారుడు తన వాహ నం, పేరు రెండూ రిజిస్టర్ కావాలి. బ్యాంక్ అకౌంట్తో అనుసంధానం చేసుకోవాలి.
జీపీఎస్ టోల్ అమల్లోకి వస్తే ఉచిత ప్రయాణానికి చెక్ పడనుంది. ఉదాహరణకు.. వరంగల్ హైవే ఘట్కేసర్ నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి వచ్చే వాళ్లు గూడూరులో టోల్ కట్టాల్సి ఉంటుంది. గూడూరు కంటే ముందే బీబీనగర్ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు టోల్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇదే విధంగా చౌటుప్పల్ వరకు ప్రయాణించి అట్నుంచి సంస్థాన్నారాయణపురం, గట్టుప్పల్ వైపు వెళ్లే వాహనదారులు ఇప్పుడు టోల్ కట్టడం లేదు. జీపీఎస్ విధానం వస్తే ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరం చెల్లించాల్సి ఉంటుంది.