మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నది. చెరువుల్లో ఉచితంగా చేప పిల్లల విడుదల చేయడం దగ్గర నుంచి సబ్సిడీపై రవాణా వాహనాలు, వలల వరకు పంపిణీ చేస్తున్నది. ఇక మత్స్య పారిశ్రామిక మహిళా సంఘాలకు చేయూతనిచ్చేందుకు మత్స్య శాఖ ఆధ్వర్యంలో చేప వంటకాల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నది. సూర్యాపేట జిల్లాకు చెందిన రెండు సంఘాల మహిళలు ఇటీవల హైదరాబాద్లో మూడు రోజుల పాటు 15 రకాల వంటకాలపై ట్రైనింగ్ తీసుకున్న సర్టిఫికెట్లు కూడా పొందారు. ఫిష్ కోర్టులు ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందేందుకు ప్రభుత్వం రుణాలు కూడా ఇవ్వనున్నది. ఇందుకోసం మత్స్య పారిశ్రామిక మహిళా సంఘంలో సభ్యులుగా ఉంటే చాలు.
– సూర్యాపేట, సెప్టెంబర్ 8
మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలుస్తూ వస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ మత్స్య వృత్తిదారులకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలను చెరువులు, కుంటల్లో పోయడం, వాహనాలు అందించడం, ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు లక్షల ప్రమాద బీమా వంటి పథకాలను తీసుకొచ్చి మత్స్యకారులకు అండగా నిలిచింది. ఇప్పుడు మరో పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టి అమల్లోకి తెచ్చింది. మత్స్యకార మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించేందుకు చేపలతో చేసే వివిధ రకాల వంటకాలు నేర్పించి వారితో ఫిష్ కోర్టులు ఏర్పాటు చేయించాలని తలచింది. మహిళలకు చేయూతనిచ్చి వారిని స్వశక్తితో వృద్ధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. సూర్యాపేట జిల్లాలో ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సంఘాలు (పురుషులు) 148 ఉండగా.. అందులో 16,741 మంది సభ్యులు ఉన్నారు. మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు 4 ఉండగా.. వాటిల్లో 250 మంది మహిళా సభ్యులు చేరారు. మరో ఐదు మత్స్య పారిశ్రామిక మార్కెటింగ్ సహకార సంఘాల్లో 285 మంది సభ్యులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు 157 ఉండగా.. వాటిల్లో 17,276 మంది సభ్యులు ఉన్నారు. ఈ సంఘాల పరిధిలోని 850 చెరువులు, కుంటల్లో ప్రభుత్వం సబ్సిడీ చేపలను పోయిస్తున్నది. ఇలా ప్రతి ఏటా దాదాపు 3.60 కోట్ల చేప పిల్లలను ఉచితంగా అందిస్తున్నది. వీటితోపాటు వాహనాలను, చేపలు స్టోర్ చేసుకోవడానికి ఫ్రీజర్ వంటివి అందించి వారి ఆర్థిక బలోపేతానికి చేయూతనిస్తున్నది.
మత్స్యకార మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు సర్కారు చేయూతనిస్తున్నది. చేపలతో చేసే వంటకాల్లో శిక్షణ ఇప్పించడంతోపాటు ఫిష్ కోర్టుల ఏర్పాటుకు రుణాలు అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే జిల్లాలోని రెండు సంఘాల మహిళలకు హైదరాబాద్లో శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందించారు. ఆసక్తి ఉన్న మహిళా సభ్యులందరికీ వంటలు నేర్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
– సూర్యాపేట, సెప్టెంబర్ 8
మత్స్యకార మహిళా పారిశ్రామిక సహకార సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వాటిల్లోని సభ్యులకు చేపల వంటకాల్లో శిక్షణ ఇచ్చే కార్యక్రమం చేపట్టింది. హైదరాబాద్లోని NITHAM సంస్థతో కలిపి దాదాపు 15 రకాల వంటకాల్లో 3 రోజులపాటు శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలోని మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లోని మహిళలను అక్కడికి తీసుకెళ్లి శిక్షణ ఇవ్వనున్నారు. సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట, కోదాడ, సిరిపురం, నాగాయిగూడెం మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో సూర్యాపేట, కోదాడ సంఘాల్లో పది మంది చొప్పున సభ్యులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందించారు. శిక్షణ పొందిన మహిళలు ఇక్కడికి వచ్చి సంఘంలోని మిగతా సభ్యులకు శిక్షణ ఇస్తారు. ఫిష్ కోర్టు పెట్టుకోవడానికి ముందుకొచ్చే వారికి బ్యాంకు రుణాలు అందించనున్నది. కాగా, జిల్లాలో మహిళా మత్స్య సహకార సంఘాల సంఖ్యను పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలో మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు 4 మాత్రమే ఉండగా.. వాటి సంఖ్యను పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 18 సంవత్సరాలు నిండిన మహిళలు 25 మందిని కలిసి మత్స్య సహకార సంఘంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందులో మత్స్యకార కుటుంబాలకు మాత్రమే అవకాశం ఉన్నది. కనీసం 25 మంది సభ్యులు ఉండాలి. సభ్యుల సంఖ్య ఎంతైనా ఉండొచ్చు.
జిల్లాలో మహిళా మత్స్య సహకార సంఘాలు నాలుగు మాత్రమే ఉన్నాయి. ఈ సంఖ్యను పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నాం. సంఘం ఏర్పాటుకు ముందుకొచ్చే వారు దరఖాస్తు చేసుకోవాలి. మత్స్య సహకార సంఘం ఏర్పాటు తరువాత చేపల వంటకాల్లో శిక్షణ ఇప్పిస్తాం. ఆ తరువాత ఫిష్ కోర్టుల ఏర్పాటుకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తాం. మత్స్యకార మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడమే ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటి వరకు రెండు సంఘాలకు చెందిన మహిళలకు శిక్షణ ఇప్పించాం.
– రూపేందర్, జిల్లా మత్స్యశాఖ అధికారి, సూర్యాపేట