మునుగోడు, డిసెంబర్ 1 : ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, భవిత కేంద్రాల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తెలంగాణ ప్రభుత్వం వరం ప్రకటించింది. ఆరు నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షల వరకు ఉత్తీర్ణత మార్కులు తగ్గించడంతో పాటు పలు మినహాయింపులు ప్రకటించింది. సాధారణ విద్యార్థుల మాదిరిగా 6 నుంచి 9వ తరగతి చదువుతున్న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులు అన్ని పరీక్షలు రాయకున్నా పై తరగతికి ప్రమోట్ చేసేలా వెసులుబాటు కల్పించింది. ఈ ఏడాది నుంచే ప్రభుత్వ ఉత్తర్వులు అమలు కానున్నాయి. దీంతో సుమారు 21 విభాగాల్లోని దివ్యాంగుల జీవితాల్లో అక్షర వెలుగులు నిండనున్నాయి.
నల్లగొండ జిల్లాలో 592 మంది విద్యార్థులకు ప్రయోజనం
ఒక్కో భవిత కేంద్రంలో ఐఈఆర్పీ(విలీన విద్యాబోధకులు) ద్వారా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తిస్తున్నారు. ఒక్కో కేంద్రంలో ఇద్దరు నుంచి ముగ్గురు ఐఈఆర్పీలుగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం 6-18 ఏళ్ల వయస్సున్న ప్రత్యేక అవసరాల పిల్లల వైకల్యం, వారి ఇబ్బందులు, తదితర సమాచారాన్ని సేకరిస్తున్నారు. వీరిని సమీపంలోని భవిత, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. పిల్లల ఆర్యోగ స్థితిగతుల ఆధారంగా వారిలో మానసిక వికాసం నింపుతున్నారు. జిల్లాలోని 52 భవిత కేంద్రాలతో పాటు పలు ప్రభుత్వ పాఠశాలల్లో 592 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.
కనీస ఉత్తీర్ణత అర్హత మార్కుల కుదింపు
ప్రభుత్వ తాజా ఉత్తర్వులు ప్రకారం మూగ, చెవిటి, మెదడు సంబంధిత వ్యాధులు, తలసేమియా, హీమోఫిలియా వ్యాధిగ్రస్తులు, తీవ్రమైన శ్వాశత అంగవైకల్యం, పాక్షిక అంధత్వం, కాలు, చేయి తొలగింపునకు గురైన వారు, యాసిడ్ దాడి బాధితులకు మినహాయింపు వర్తించనున్నది. తీవ్రమైన మానసిక, శారీరక సమస్యలున్న విద్యార్థులు వార్షిక పరీక్షల్లో 10 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులవుతారు. మిగిలిన వారికి 20 మార్కులు వస్తే చాలు.
ఉన్నత విద్యాభ్యాసానికి బాటలు
జీఓ నంబర్ 27 ప్రకారం ప్రత్యేక అవసరాల పిల్లల భవిష్యత్ను బంగారుమయం చేసేందుకు ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఆదేశాలు జారీ చేసింది. వివిధ కేటగిరీల్లో వైక్యలం ఉన్నవారికి పరీక్షల్లో మినహాయింపు ఇచ్చింది. వీటిని జిల్లాలోని అన్ని భవిత కేంద్రాలు, పాఠశాలల్లో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఉత్తీర్ణత మార్కులు కూడా తగ్గించడంతో చాలా మంది ఉన్నత విద్యాభ్యాసానికి బాటలు పడుతాయి.
– వంగూరు వీరయ్య, విలీన విద్య సమన్వయకర్త, నల్లగొండ
పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు
ప్రత్యేక అవసరాల పిల్లలు పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే పరీక్ష రాసే సమయాన్ని కూడా పెంచారు. ప్రత్యేకావసరాల పిల్లలకు గంటకు 20 నిమిషాల చొప్పున అదనంగా 60 నిమిషాలు ఎక్కువ కేటాయిస్తారు. అలాగే పరీక్ష కేంద్రంలోకి కాలిక్యులేటర్లకు అనుమతి ఉంది. వీరికి ప్రత్యేక జవాబు ప్రతాలు అందిస్తారు. మూడు భాషా సబ్జెక్టుల్లో ఏవైనా రెండు రాస్తే చాలు. తరగతులకు 50 శాతం హాజరున్నా సరిపోతుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారుంటే అక్కడే పరీక్ష రాసే ఏర్పాట్లు చేస్తారు. భాషా ఉచ్ఛారణ సంబంధిత వైక్యలం ఉన్న వారికి జవాబు పత్రాలను ఆయా విభాగాల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో మూల్యాంకనం చేయిస్తారు. వినికిడి సమస్య తీవ్రంగా ఉన్న వారికి చేతి సైగలతో అన్వయించే వారు సహకరిస్తారు. పరీక్ష సమయంలో వీరు వినికిడి ఉపకరణాలు ఉపయోగించుకోవచ్చు. లోకోమోటార్ వైకల్యం కలిగిన వారితో గ్రౌండ్ ఫ్లోర్లోనే పరీక్ష రాయించాలి. జంబ్లింగ్ పద్ధతిలోనూ దివ్యాంగులకు మినహాయింపు ఉంటుంది.