యాదగిరిగుట్ట, ఫిబ్రవరి3 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. రాజ్భవన్ నుంచి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా ఉదయం 8.30 గంటలకు యాదగిరిగుట్ట కొండపైన గల వీవీఐపీ అతిథి గృహం వద్దకు చేరుకున్నారు. కలెక్టర్ పమేలా సత్పతి గవర్నర్కు పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు, అధికారులు బాజాభజంత్రీలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గవర్నర్ మొదటగా క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని, గండభేరుండ స్వామివారిని దర్శించుకోగా అర్చకులు హారతినిచ్చారు. ఆలయ ముఖ మండపంలోకి వెళ్లిన గవర్నర్ ధ్వజస్తంభానికి మొక్కారు. అక్కడి నుంచి నేరుగా స్వయంభూ నారసింహుడి గర్భాలయంలోకి ప్రవేశించారు. ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, ముఖ్య అర్చకులు మూడు నిమిషాలపాటు నిర్వహించిన బంగారు పుష్పార్చనలో తమిళిసై పాల్గొన్నారు.
అనంతరం గవర్నర్కు ప్రధానార్చక బృందం స్వామివారి ఆశీర్వచనం చేసింది. స్వామివారి గర్భాలయంలో గవర్నర్ 5 నిమిషాలపాటు గడిపారు. అక్కడి నుంచి నేరుగా ఆండాళ్ అమ్మవారిని దర్శించుకుని, ప్రధానాలయ ముఖ మండపంలోకి చేరుకున్నారు. గవర్నర్కు ప్రధానార్చక బృందం చతుర్వేద ఆశీర్వచనం చేసింది. కలెక్టర్ పమేలా సత్పతి స్వామివారి శేష వస్ర్తాలను, ఆలయ ఇన్చార్జి ఈఓ రామకృష్ణారావు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. మీడియాను గమనించి ‘అందరికీ బెస్ట్ విషెస్’ అంటూ కామెంట్ చేశారు. అనంతరం ఉదయం 9.05 గంటలకు ప్రత్యేక కాన్వాయి ద్వారా తిరుగు ప్రయాణమయ్యారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, ఆర్డీఓ భూపాల్రెడ్డి, ఆలయ డీఈఓ దోర్బాల భాస్కర్ శర్మ, ప్రధానార్చకుడు మోహనాచార్యులు, ఉప ప్రధానార్చకుడు మాధవాచార్యులు, ఏఈఓ గజవెల్లి రమేశ్బాబు, తాసీల్దార్ రామునాయక్, అర్చకులు, వేద పండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.