– బీసీ విద్యార్థి సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్
నల్లగొండ రూరల్, జూన్ 30 : బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని అన్ని కళాశాలలను బంద్ చేసి నిరసన కార్యక్రమం నిర్వహించినట్లు బీసీ విద్యార్థి సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను ప్రభుత్వం విడుదల చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన బంద్కు సహకరించిన కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు, ప్రజా సంఘాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న సుమారు రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థుల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేశారు.
అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలు, కళాశాలలకు సొంత భవనాలు నిర్మించాలని, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం.8, 9 వల్ల విద్యార్థుల్లో తీవ్ర గందరగోళం నెలకొందని, ఆ జీవోలను వెంటనే రద్దు చేసి ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి చట్టబద్ధ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఫీజు బకాయిల కారణంగా కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, దీంతో ఉద్యోగాలు, ఉన్నత విద్య అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్లో బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయకుండా గత 18 సంవత్సరాలుగా అమలులో ఉన్న విధానాన్నే కొనసాగించాలని కోరారు.
విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడకుండా వెంటనే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని అన్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే జూలై మొదటి వారంలో హైదరాబాద్లో ఐదు లక్షల మంది విద్యార్థులతో భారీ ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రజక అభివృద్ధి సంస్థ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చిలకరాజు సతీష్, విద్యార్థి సంఘం నాయకులు కొంపల్లి రామన్న గౌడ్, అనంత నాగరాజు గౌడ్, గడగోజు విజయాచారి, నాగేష్, హరిప్రసాద్, కృష్ణ, మహేష్, శివ, మధు, మల్లేష్, నరేష్, పృథ్వీరాజ్, మణికంఠ పాల్గొన్నారు.