బొమ్మలరామారం, మార్చి27 : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని గద్దరాళ్లతండా, ప్యారారం గ్రామాల్లో ఎమ్మెల్సీ నిధులతో చేపట్టిన కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన, మర్యాలలో రూ.25 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానను సోమవారం వారు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఉచిత కరెంట్, రైతుబీమా, రైతు బంధు వంటి పథకాలతో వ్యవసాయం పండుగలా మారిందని పేర్కొన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలతోపాటు కంటి వెలుగు ద్వారా అంధత్వ నివారణే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చిమ్ముల సుధీర్రెడ్డి, భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుషంగల సత్యనారాయణ, పీఏసీఎస్ చైర్మన్ గూదె బాలనర్సింహ, సర్పంచులు కుర్మిండ్ల దామోదర్గౌడ్, రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పోలగాని వెంకటేశ్గౌడ్, నాయకులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట రూరల్ : మండలంలోని మాసాయిపేటకు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి మంగళవారం రానున్నట్లు సర్పంచ్ వంటేరు సువర్ణ తెలిపారు. గ్రామంలో బీసీ కమ్యూనిటీ హాల్ భవనాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.