రామగిరి, ఏప్రిల్ 25 : వేసవి సెలవులు ముగిసిన తర్వాత స్కూళ్లు పునఃప్రారంభం కాగానే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం యూడైస్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ముందస్తుగానే సిద్ధం చేసిన పుస్తకాలను జిల్లా పాఠ్యపుస్తక కేంద్రానికి (బుక్ డిపో) పంపిస్తున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 72 మండలాల్లోని 3,113 ప్రభుత్వ పాఠశాలకు 15 లక్షలకుపైగా బుక్స్ అవసరం కాగా ఇప్పటి వరకు 5లక్షలకుపైగా వచ్చాయి. విడుతల వారీగా పుస్తకాలను ఆర్టీసీ కార్గో వాహనాల్లో చేరవేస్తున్నారు. వేసవి సెలవుల్లోనే జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు పుస్తకాలను తరలించే ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం పంపిణీ చేసే పాఠ్య పుస్తకాలు పక్కదారి పట్టకుండా వాటిపై క్యూ ఆర్ కోడ్ను నమోదు చేశారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వివిధ యాజమాన్యాల పరిధిలో 3,113 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, గురుకుల, మోడల్ స్కూల్స్ ఉన్నాయి. వీటిలో 4,90,982 మంది విద్యార్థులు 1 నుంచి 10వ తరగతి వరకు (2022-23 యూడైస్ గణాంకాల ప్రకారం) విద్యను అభ్యసిస్తున్నారు. అయితే వీరందరికి ప్రభుత్వమే పాఠ్య పుస్తకాలను ఉచితంగా అందిస్తుంది. 2022-23 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాద్యమం అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే విద్యార్థులు ఆంగ్ల మాద్యంలో సులభంగా రాణించేలా 1 నుంచి 8వ తరగతి వరకు కొత్త పాఠ్య పుస్తకాలు నాన్ లాంగ్వేజ్కు సంబంధించి ద్వి భాషలో ముద్రించారు. కాగా జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానుండగా ముందస్తుగానే పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం చేరవేస్తుంది. జిల్లా కేంద్రాలకు చేరిన పాఠ్య పుస్తకాలను డీఈఓల ఆదేశాలతో మండల కేంద్రాలకు చేరవేయనున్నారు.
ఉమ్మడి జిల్లాలో 3,113 ప్రభుత్వ పాఠశాలలు
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 3,113 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో చదివే విద్యార్థులకు 15,72,570 వివిధ సబ్జెక్టుల పాఠ్య పుస్తకాలు అవసరం ఉన్నాయి. అయితే ఇప్పటివరకు 5,24,871 పాఠ్య పుస్తకాలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠ్య పుస్తక విభాగానికి చేరాయి. దశలవారీగా పాఠ్య పుస్తకాలు వస్తున్నట్లు ఆయా బుక్ డిపోల మేనేజర్లు తెలుపుతున్నారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించగా మే నెలలోనే అన్ని జిల్లా కేంద్రాలకు పాఠ్య పుస్తకాలను చేరవేసి అన్ని మండలాలకు అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
పాఠ్య పుస్తకాలకు బార్ కోడ్
ప్రభుత్వం పంపిణీ చేసే పాఠ్య పుస్తకాలు పక్కదారి పట్టకుండా అక్రమాలకు చెక్ పెట్టేలా ప్రతి పుస్తకానికి ప్రత్యేక బార్కోడ్, క్యూఆర్ కోడ్ను ముద్రించారు. ఆయా పాఠశాలల నుంచి సేకరించిన యూడైస్లోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగానే పుస్తకంపై నంబరింగ్ ఇచ్చారు. ఆ పాఠశాలలోని ప్రతి విద్యార్థికి కచ్చితంగా ఆ నంబర్ పుస్తకమే చేరుతుంది. దీంతో అక్రమాలకు చెక్ పడనుంది. ఒకవేళ పాఠ్య పుస్తకాలు బహిరంగ మార్కెట్లో కనిపించినట్లయితే అందుకు సంబంధిత ఎంఈఓలే బాధ్యులవుతారు. ప్రభుత్వం సరఫరా చేసే ఈ పాఠ్య పుస్తకాలు ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు పక్కదారి పట్టకుండా చైల్డ్ ఇన్ఫోలో నమోదైన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రత్యేక క్రమసంఖ్య నమోదుతో ఆయా మండలాలకు సరఫరా అవుతున్నాయి. ప్రైవేటు పాఠశాలలకు అందించే పుస్తకాలపై సేల్ అనే పదం ముద్రించి ఉంటుంది. దాంతో వాటిని ఈజీగా గుర్తుపట్టొచ్చు.