కార్పొరేట్ స్కూల్ను తలదన్నేలా బోగారం ప్రాథమిక పాఠశాల
హెచ్పీసీఎల్ సంస్థ రూ.30 లక్షల సహకారంతో వసతుల కల్పన
రామన్నపేట, జూన్ 22 : కార్పొరేట్ విద్యాసంస్థను తలదన్నేలా ముస్తాబైంది మండలంలోని బోగారం ప్రాథమికోన్నత పాఠశాల. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మన ఊరు- మనబడి కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని హెచ్పీసీఎల్ సంస్థ సామాజిక బాధ్యతతో రూ.30లక్షలు వెచ్చించి పాఠశాలలో ఆధునిక వసతులను కల్పించింది. పాఠశాల భవనానికి మరమ్మతులు చేయించి రంగులు వేయించింది. విద్యార్థులకు సురక్షితమైన తాగునీటిని అందించేందుకు వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసింది. ప్రతి గదిలో ఫ్యాన్లు, ట్యూబ్లైట్లను బిగించింది. వర్షం వచ్చినా వంటకు ఇబ్బంది కలుగకుండా కిచెన్ షెడ్డుతోపాటు విద్యార్థులు భోజనం చేసేందుకు వీలుగా డైనింగ్ హాల్ను నిర్మించింది. చేతులు శుభ్రం చేసుకోవడానికి ప్రత్యేక నల్లాలు ఏర్పాటు చేసింది. బాలురు, బాలికలకు వేర్వేరుగా బాత్రూమ్లను నిర్మించింది.
100 మందికి పైగా విద్యార్థులు
పాఠశాలలో ప్రస్తుతం 100 మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలలో ఒక స్కూల్ అసిస్టెంట్తోపాటు నలుగురు ఎస్జీటీలు పని చేస్తున్నారు. ప్రతి గదిలో ఉపాధ్యాయుల కోసం టేబుల్, కుర్చీలతోపాటు విద్యార్థులకు డెస్క్ బెంచీలు ఏర్పాటు చేశారు. పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధనతో పాటు రెండు కంప్యూటర్లతో టెక్నికల్ స్కిల్స్ అందిస్తున్నారు. పాఠశాల విద్యార్థులతోపాటు అంగన్వాడీ కేంద్రం పిల్లలు ఆడుకునేందుకు వీలుగా జారుడు బండ, ఉయ్యాలలు ఏర్పాటుచేయగా విద్యార్థులు ఆడుకునేందుకు పలు క్రీడా పరికరాలను అందజేశారు.
పాఠశాల ఆహ్లాదకరంగా ఉంది
హెచ్పీసీఎల్ వారు కల్పించిన వసతులతో పాఠశాల వాతావరణ ఆహ్లాదకరంగా మారింది. డెస్క్ బెంచీలు సౌకర్యవంతంగా ఉన్నాయి. తరగతి గదులు అలసటను మరిపించి పాఠాలు శ్రద్ధతో వినే విధంగా ఉన్నాయి. బాత్రూములు, హ్యాండ్ వాష్ నల్లాలు, ఫ్యూరిఫైడ్ వాటర్ప్లాంట్తో స్కూల్ కొత్తగా కనిపిస్తున్నది.
– పావని, 7వ తరగతి విద్యార్థి
ప్రభుత్వ బడిలో చేర్పించండి
హెచ్పీసీఎల్ సహకారంతో పాఠశాలలో మంచి వసతులు కల్పించాం. అంకితవంతో పనిచేసే ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రైవేటు పాఠశాలలకు మించిన మెరుగైన విద్యాబోధన అందుతున్నది. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి బలోపేతం చేయడానికి సహకరించాలి.
– కడారి పాపయ్య, విద్యాకమిటీ చైర్మన్, బోగారం ప్రాథమికోన్నత పాఠశాల