గంగ జమునా తెహజీబ్ సంస్కృతికి కేరాఫ్ అయిన తెలంగాణలో సర్వమత పండుగలకు సమ ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ తోఫాను సిద్ధం చేసింది. పండుగ పూట నిరుపేదల ముస్లింల ఇండ్లలో సంతోషాలు నింపేందుకు గిఫ్ట్ ప్యాక్లను అందిస్తున్నది. జిల్లాలోని 4 నియోజకవర్గాల్లోని 6,500 కుటుంబాలకు అందించేందుకు ప్యాకెట్లను ఇప్పటికే జిల్లాకేంద్రానికి పంపించింది. త్వరలోనే జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి చేతుల మీదుగా పంపిణీని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఇఫ్తార్ విందుల కోసం ప్రభుత్వం రూ.13లక్షలు మంజూరు చేసింది.
– సూర్యాపేట, ఏప్రిల్ 1
సూర్యాపేట, ఏప్రిల్ 1 : సర్వమతాలను సమానంగా చూస్తూ అన్ని పండుగలను ఘనంగా జరుపుతున్నది రాష్ట్ర ప్రభుత్వం. ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్రం ఏర్పాటు నుంచి వారికి రంజాన్ తోఫా అందిస్తున్నది. జిల్లాలోని నాలుగు నియోజక వర్గాలకు 6,500 రంజాన్ తోఫాలతోపాటు ఇఫ్తార్ విందుల కోసం రూ.13 లక్షలు మంజూరు చేసింది. ఇప్పటికే రంజాన్ తోఫాలు జిల్లా కేంద్రానికి చేరుకోగా వాటిని ఆయా నియోజకవర్గాలకు పంపించారు. వీటిని త్వరలోనే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన అనంతరం ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పంపిణీ చేయనున్నారు. వారం రోజుల్లో ప్రక్రియ ప్రారంభం కానున్నది.
సూర్యాపేటకు చేరిన గిఫ్ట్ప్యాక్లు
జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు 6,500 రంజాన్ తోఫాలను పంపించారు. వాటిని స్థానిక మైనార్టీ స్కూల్లో నిల్వ చేశారు. కోదాడ నియోజకవర్గానికి 2,000, సూర్యాపేట, హుజూర్నగర్, తుంగతుర్తికి 1,500 చొప్పున పంపిణీ చేయనున్నారు. తోఫాలో చీర, జాకెట్, పంజాబీ డ్రెస్, కుర్తా ఫైజామా మెటీరియల్, పంచదార, సేమ్యా ఉన్నాయి. అలాగే ఇఫ్తార్ విందుల కోసం ప్రభుత్వం జిల్లాకు రూ.13 లక్షలు కేటాయించింది. కోదాడ నియోజకవర్గానికి రూ.4 లక్షలు, సూర్యాపేటకు రూ.3 లక్షలు, తుంగతుర్తికి రూ.3 లక్షలు, హుజూర్నగర్ కు రూ.3 లక్షల చొప్పున మంజూరు చేసింది. రంజాన్ తోఫాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, మంత్రి జగదీశ్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో త్వరలోనే పంపిణీ చేయనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి విజయేందర్రెడ్డి తెలిపారు.