నల్లగొండ, ఆగస్టు 22 ;వ్యవసాయ రంగంలో ఇప్పటికే మిషనరీ వ్యవస్థను ప్రవేశపెట్టి ఆ రంగాన్ని పురోగమనం దిశగా నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అడ్వాన్స్డ్ సాంకేతికతను జోడించి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నది. వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీని వినియోగించే పెద్దన్న, మనకు డ్రిప్ వ్యవస్థను పరిచయం చేసిన (లీడర్ ఆఫ్ ది వరల్డ్ ఇన్ అగ్రికల్చర్ కంట్రీ) ఇజ్రాయిల్ దేశ సాంకేతికను ఇక్కడ అమలు చేసేలా ప్రయత్నాలు చేస్తున్నది. ఇజ్రాయిల్లోని వాతావరణ పరిస్థితులు, మన దేశ పరిస్థితులు దాదాపు సమానంగా ఉండటంతో అక్కడి పంటలు ఇక్కడ సాగు చేయడంతోపాటు అక్కడి టెక్నాలజీని వినియోగించి క్వాలిటీతోపాటు క్వాంటిటీ పెంచాలనే ఆలోచనతో అడుగులు వేస్తున్నది. ఈ నేపథ్యంలో 29 మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని ఇజ్రాయిల్ పంపించగా.. వారు అక్కడి వ్యవసాయ రంగంపై అధ్యయనం చేశారు. దానికి సంబంధించిన నివేదికను సిద్ధ్దం చేసి ప్రభుత్వానికి నివేదించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ టెక్నాలజీని తొలుత ఉద్యాన శాఖలో అమలు చేసి.. ఆ తర్వాత ఆహార, వాణిజ్య పంటల్లో వినియోగించేలా ప్రణాళికలు రూపొందించనున్నారు.
92 లక్షల జనాభా.. 10.82 లక్షల సాగు భూములు.. అదీనూ ఇసుక నేలలు.. ఆ నేలల్లో నది లేదా సముద్రం ద్వారా వినియోగించే సాల్ట్ వాటర్ను డీ సాలిటేషన్ చేసి ఎన్నో రకాల ఆహార, వాణిజ్య పంటలతోపాటు పండ్లు, కూరగాయలు పండిస్తున్న దేశం ఇజ్రాయిల్. తక్కువ జనాభా ఉన్న అక్కడ కూలీల కోసం ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి. ఆ స్థితి నుంచి బయట పడటంతోపాటు నిస్సారమైన నేలల్లో సాగు పెంచి గణనీయమైన ఉత్పత్తులు పొందాలని ఆలోచించింది అక్కడి ప్రభుత్వం. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో విత్తనం విత్తే దగ్గర నుంచి మార్కెటింగ్ వరకు ఒక్క రైతే నాలుగైదు వందల హెక్టార్ల పంటలను పర్యవేక్షిస్తూ క్వాలిటీతోపాటు క్వాంటిటీ పెంచి ఆ ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్న స్థితికి చేరింది. దీనికి కారణం సెన్సార్ (టెక్నాలజీతో పర్యవేక్షణ)తో వ్యవసాయం చేయడమే. మన జిల్లాలో పంటల ఉత్పత్తి పెరుగడానికి ఈ టెక్నాలజీ ఉపయోగపడనుంది. జిల్లాలో గత పదేండ్లలో సుమారు 9లక్షల ఎకరాల్లో సాగు పెరుగగా.. అందులో వరి, పండ్ల తోటల సాగు గణనీయంగా ఉన్నది. రానున్న రోజుల్లో మరింత ఉత్పత్తి సాధించే దిశగా ఈ టెక్నాలజీ ఉపయోగపడనుంది. అయితే తొలుత ఉద్యానవన శాఖలో వచ్చే వానకాలం సీజన్ నుంచి అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది.
వ్యవసాయ రంగంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో ఎన్నో మార్పులు తీసుకురావడంతో పాటు ఆధునిక యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అడ్వాన్స్డ్ టెక్నాలజీని వినియోగించేందుకు చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగా ఇప్పటికే ఇజ్రాయిల్లో వినియోగిస్తున్న ఆధునిక సాంకేతికను ఇక్కడ అమలు చేయాలని యోచించింది. ఇందుకోసం ఈ నెల 6నుంచి 10వ తేదీ వరకు రాష్ట్రం నుంచి 29 మందితో కూడిన బృందాన్ని ఇజ్రాయిల్కు పంపించి అక్కడి పంటలు, సాగు విధానం, టెక్నాలజీపై అధ్యయనం చేయించింది. అక్కడ ఒక్క రైతే నాలుగైదు వందల హెక్టార్లలో విత్తనం విత్తే దగ్గర నుంచి మార్కెటింగ్ చేసే వరకు పర్యవేక్షణ చేస్తాడు. సెన్సార్తో ఏ పంటకు ఎంత నీరు వెళ్తుంది.. ఏ మొక్కకు ఏ తెగులు వచ్చిందో పరిశీలించి జీవ నియంత్రణ యాంత్రిక నివారణ ద్వారా లేదా డ్రోన్లతో సేంద్రీయ పద్ధతిలో పిచికారీ చేసి పంటను రక్షిస్తాడు. ఒకవేళ రసాయన ఎరువులు వాడాలంటే వ్యవసాయ శాఖ మంత్రి అనుమతి తీసుకోవాలి. దీన్ని బట్టి చూస్తే భూ సార సంరక్షణ ఏ స్థాయిలో జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఆ విధానాన్ని మన రాష్ట్రంలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచించి ఆ మేరకు రూపకల్పన చేస్తున్నది.
పండ్ల సాగులో కొత్త వెరైటీలు
వచ్చే ఏడాది జిల్లాలో పండ్ల సాగులో కొత్త వెరైటీలు సాగు చేసేలా రైతాంగాన్ని ఉద్యాన శాఖ అవగాహన పరుచనుంది. ఇజ్రాయిల్లో నిస్సారమైన నేలల్లోనే అనేక రకాల పండ్ల సాగు చేస్తుంటే.. మన భూముల్లో 90శాతం ఎర్రనేలలు ఉన్న ప్రాంతంలో ఎన్నో రకాల పండ్ల తోటలు సాగు చేయవచ్చు. అక్కడ వేసవిలో 38నుంచి 45 డిగ్రీల వరకు ఇతర కాలాల్లో 15నుంచి 25 డిగ్రీల వరకు ఉండటంతో పాలీహౌజ్లు, గ్రీన్ హౌజ్లు వినియోగించి పంటలు పండిస్తున్నారు. మన దగ్గర కూడా వినియోగిస్తున్నప్పటికీ ఇక నుంచి పూర్తి స్థాయిలో వినియోగించాల్సి ఉంది. పైగా అక్కడ నీరు సాలిటేషన్ కాగా, మన దగ్గర పూర్తిగా శుద్ధమైనది కావడం కలిసొచ్చే అంశం. అక్కడ ఉద్యాన పంటల్లో మన దగ్గర పండించే ఆరెంజ్ (బత్తాయి) సహా మామిడి, దానిమ్మతోపాటు కొత్తగా ద్రాక్ష, చెర్రీ, లిచి, పీచ్, ఫ్లమ్, పియర్, ఆవకాడ్, డేట్స్, ఆల్మ్డ్, పార్సిమోన్, యాపిల్ వంటి పంటలు పండిస్తున్నారు. ఆహార, వాణిజ్య పంటల్లో గోధుమ, బార్లీ, పత్తి, మొక్కజొన్న.. కూరగాయల్లో టమాట, చిల్ పెప్పర్, జుకినీ, స్కాష్, కీర లాంటివి పండిస్తారు. ఇవి మన దగ్గర కంటే ఇజ్రాయిల్లో ఎక్కువ క్వాలిటీతోపాటు క్వాంటిటీ వస్తుండటంతో అక్కడి పద్ధతిలో సాగు చేయాలనే ఆలోచనతో ఉన్న సర్కారు ఈ టూర్ చేపట్టింది.
జిల్లాలో పెరుగుతున్న సాగు.. తగ్గుతున్న పర్యవేక్షణ
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగు ఏటేటా గణనీయంగా పెరుగుతుండగా.. కూలీల కొరత నేపథ్యంలో పంటలపై పర్యవేక్షణ కొరవడుతున్నది. ఉమ్మడి జిల్లాలో 35.09 లక్షల ఎకరాల భూములు ఉండగా, అందులో 2013-14లో 13.12 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈ ఏడాది 22.38 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. క్రిష్ణా, గోదావరి జలాల రాకతో పదేండ్లలోనే జిల్లాలో 9లక్షలకు పైగా సాగు భూములు పెరిగాయి. ఉద్యాన పంటలు లక్ష ఎకరాల్లో సాగవుతున్నాయి. అయితే.. పెద్ద కమతాల్లో వ్యవసాయం చేసేవారు పర్యవేక్షణ లోపం వల్ల ఎక్కువ ఉత్పత్తి చేయలేక పోతున్నారు. చదువుకున్న యువత ఆధునిక వ్యవసాయం చేస్తున్నప్పటికీ పర్యవేక్షణ చేయలేకపోవడంతో అనుకున్న స్థాయిలో ఉత్పత్తి రాబట్టలేకపోతున్నారు. సెన్సార్ విధానంతో పంటలపై పర్యవేక్షణ పెరుగుతుందని భావిస్తున్న ప్రభుత్వం.. వచ్చే సీజన్ నుంచి ఈ సాంకేతికతను జోడించనుంది.
తొలుత ఉద్యాన పంటలకు అనుసంధానం
వ్యవసాయ రంగంలో మూస పద్ధతులకు స్వస్తి చెప్పి ఆధునిక టెక్నాలజీని అమలు చేయాలని ఆలోచన చేస్తున్న ప్రభుత్వం.. తొలుత ఉద్యాన పంటలకు వర్తింపజేయాలని రూపకల్పన చేస్తున్నది. రాష్ట్ర జనాభాకు అనుగుణంగా పండ్లు ఉత్పత్తి కావడం లేదని గుర్తించిన సర్కార్ రాష్ట్రంలో తక్కువ భూముల్లో ఎక్కువ ఉద్యాన పంటలు సాగు చేసి టెక్నాలజీ ద్వారా క్వాలిటీతోపాటు క్వాంటిటీ పెంచే దిశగా ఆలోచన చేస్తున్నది. ప్రస్తుతం మన దగ్గర పండించే పండ్ల తోటలతోపాటు ఆహార, వాణిజ్య, కూరగాయలు ఆధునిక పద్ధతిలో పండించాలని ఉద్యానశాఖ అధికారులకు సూచనలు చేసింది. అయితే.. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో పండే పండ్ల ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకొని కోల్డ్ స్టోరీజీల నిర్మాణం చేయాలని నిర్ణయించింది. ఈ తరహాలో పంటలు పండించి కోల్డ్ స్టోరేజీల్లో పండ్ల ఉత్పత్తులు నిల్వ చేసి డిమాండ్ను బట్టి మార్కెటింగ్ చేస్తే రైతుకు మంచి ధర లభిస్తుందని ప్రభుత్వం యోచిస్తున్నది.
కొత్త టెక్నాలజీ జిల్లాకు చాలా మేలు చేస్తుంది
ఇజ్రాయిల్ చిన్న దేశం అయినప్పటికీ అక్కడ రైతాంగం ఫాలో అవుతున్న ఆధునిక టెక్నాలజీ వల్ల తక్కువ భూమి, తక్కువ నీటితో గణనీయమైన ఉత్పత్తి సాధిస్తున్నారు. ఒక్కరే నాలుగైదు వందల హెక్టార్ల భూమిని సెన్సార్ల ద్వారా పర్యవేక్షించే పరిస్థితి అక్కడ ఉన్నది. మ్యాన్ పవర్ లేకున్నా ఆ టెక్నాలజీని అమలు చేస్తే మన దగ్గర కూడా గణనీయమైన ప్రగతి సాధించవచ్చు. ఈ టెక్నాలజీ మన జిల్లాలో వినియోగిస్తే మంచి ఫలితాలు వస్తాయి. జిల్లాలో పదేండ్లుగా సాగు పెరుగుతుండటం.. ఒక్కరే ఎక్కువ భూమిని పర్యవేక్షించడం ఇబ్బందిగా మారినందున ఉత్పత్తి తగ్గుతున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం 29 మందిని అధ్యయనానికి పంపంచింది. మనకు డ్రిప్ పరిచయం చేసిన ఆ దేశంలో వినియోగిస్తున్న టెక్నాలజీని రాష్ట్రం వినియోగించాలని అనుకుంటున్నది. దాంతో మన దగ్గర పండించే పంటల ఉత్పత్తులు మెరుగ్గా వస్తాయి.
– పిన్నపురెడ్డి అనంతరెడ్డి, ఉద్యాన శాఖ అధికారి, నల్లగొండ