మునుగోడు, మార్చి 11 : గత ప్రభుత్వాల హయాంలో మట్టి రోడ్లతో ప్రజలు నరకయాతన పడేవారు. సమస్యను పట్టించుకునే నాథుడే ఉండేవాడు కాదు. కానీ తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణాలకు నిధుల మంజూరు చేసింది. మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి కృషితో నియోజకవర్గంలోని మునుగోడు, నాంపల్లి, చండూరు, మర్రిగూడెం మండలాల్లోని గ్రామాలకు సీసీ రోడ్లు నిర్మించడానికి ప్రభుత్వం రూ.47.58 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాన కాలంలో రోడ్లపై వెళ్లాలంటేనే ప్రజలు భయపడేవారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నిధులను మంజూరు చేసింది. వాటిని సద్వినియోగం చేసుకుంటూ గ్రామాల్లోని మట్టి రోడ్లను సీసీ రోడ్లుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ పనులను మార్చిలోగా పూర్తి చేయడానికి పీఆర్ శాఖ అధికారులు ఎప్పటికప్పడు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ గుత్తేదారులకు సూచనలు చేస్తున్నారు.
మారునున్న గ్రామాల రూపురేఖలు
గ్రామాల్లో ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి నిధులు(ఎస్డీఎఫ్), ఉపాధి హామీ పథకం ద్వారా సీసీ రోడ్డు నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ సీసీ రోడ్లు నిర్మించడం వల్ల గ్రామాల రూపురేఖలే మారిపోతున్నాయి. సీసీ రోడ్లకు పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మండలాల వారీగా నిధులు..
మునుగోడు మండలానికి రూ.12.98 కోట్లు, నాంపల్లి-రూ.13.1 కోట్లు, చండూరు-11.1 కోట్లు, మర్రిగూడెం మండలానికి రూ.10.4 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికే పలుచోట్ల పనులు పూర్తి చేయగా మిగతా చోట్ల చేపడుతున్నారు.
ఊరూరా అభివృద్ధి పండుగ
మునుగోడు రూరల్ : మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు విజయవంతంగా అమలు అవుతున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. పల్లెల్లో ఎటు చూసినా వాడవాడలా కాంక్రిట్ రోడ్ల నిర్మాణాలు, కొత్త పంచాయతీ భవనాల నిర్మాణాలు సాగుతున్నాయి. నియోజకవర్గంలో ఊరురా అభివృద్ధి పండుగ జరుగుతున్నట్లు అనిపిస్తుంది.
నిధుల మంజూరు ఇలా
నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపుగా ఎస్డీఎఫ్ నిధులు రూ.36 కోట్ల 55 లక్షలు, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.34 కోట్ల 78 లక్షలు మంజూరై పనులు కొనసాగుతున్నాయి. మొత్తం రూ.71 కోట్ల 33 లక్షలు నిధులను ప్రభుత్వం కేటాయించింది. బీటీ రోడ్ల మరమ్మతుల కోసం మరో రూ.25 కోట్లు మంజూరు చేయగా పనులు కూడా ప్రారంభమయ్యాయి. రూ.35 కోట్లతో తండాల అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నారు. అలాగే పంచాయతీ రాజ్ నుంచి రూ.130 కోట్లు, ఆర్ఎండ్బీ నుంచి 95 కోట్లు, మరో రూ.35 కోట్లు ఎస్డీఎఫ్ ద్వారా, చౌటుప్పల్, చండూరు మున్సిపాలీటీలకు మంజూరైన రూ.80 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
సంతోషంగా ఉంది
ఏండ్లుగా రోడ్లు బాగా లేక చాలా కష్టపడ్డం. మా బజారుకు సిమెంట్ రోడ్డు వేయడంతో బాధ తీరింది. నెల రోజుల కింద రూ.25 లక్షలతో సిమెంట్ రోడ్లు వేసిండ్రు. వర్షం పడ్డా బైక్పై ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్తున్నం
– మహమ్మద్ హైమద్, మునుగోడు
బీఆర్ఎస్తోనే అభివృద్ధి
ఉమ్మడి జిల్లా అభివృద్ధి ప్రదాత మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో మరిన్ని అభివృద్ధి పనులకు త్వరలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకుంటాం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఏనాడు జరుగలేదు. రానున్న రోజుల్లో మరెన్నో అభివృద్ధి పనులు చేసుకుంటాం. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం. మళ్లీ కూడా ప్రజలు బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతారు.
– ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి