రామగిరి, జూన్ 27:తెలంగాణ సర్కార్ కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వసతులు కల్పిస్తుండడంతో విద్యార్థుల నుంచి స్పందన వస్తున్నది. అనుభవం గల అధ్యాపకులతో బోధన, వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తుడడంతో కళాశాలల్లో చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. గతేడాది అన్ని ప్రభుత్వ కళాశాలలో పూర్తి స్థాయిలో నిండాయి. ఈ విద్యా సంవత్సరం కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉండదు.మౌలిక వసతులకు పెద్దపీట.రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సమూల మార్పులు వచ్చాయి. కళాశాలలో సకల సౌకర్యాలు కల్పించడంతో అనుభవం గల అధ్యాపకులు, విద్యార్థులకు ప్రవేశ రుసుం లేకపోవడం, పాఠ్యపుస్తకాలను ఫ్యూరీపైడ్ వాటర్, డిజిటల్ బోధన,ఉపకార వేతనాలు అందిస్తున్నది. దాంతో ఆయా మండలాల విద్యార్థులను జూనియర్ కళాశాలల్లో తల్లిదండ్రులు విద్యార్థులను చేర్పిస్తున్నారు.
ప్రత్యేక ల్యాబ్స్
అన్ని ప్రభుత్వ కళాశాలల్లో క్రీడా మైదానాలు, కంప్యూటర్, వివిధ సబ్జెక్టులు(బోటని, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ)ల్యాబ్స్ను ఆధునిక టెక్నాలజీకితో అందుబాటులోకి తెచ్చి ప్రయోగ వనరులు పెంచారు. డిజిటల్ తరగతులు అందిస్తున్నారు. కళాశాలల్లో ఫలితాలు సైతం అదే రీతిలో వస్తున్నాయి.
ఈ ఏడాది ఇప్పటికే 1,563 అడ్మిషన్లు
జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్రెడ్డి మెమోరియల్ ప్రభుత్వ బాలుర, వృత్తి విద్యా జూనియర్ కళాశాలలు, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలలు ప్రైవేటు కళాశాలలకు ధీటుగా ఉన్నాయి. ఈ కళాశాలల్లోని ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు సమష్టిగా పనిచేస్తూ నిత్యం విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం ఇప్పటికే సుమారుగా 1,563 మంది విద్యార్థులు చేరినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో 465 మంది, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 650కి పైగా విద్యార్థినులు చేరినట్లు సమాచారం. ప్రస్తుతం పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ ముగియగా మూల్యాంకనం ఆర్వాత ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎన్రోల్మెంట్ పెరుగనుంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల రాష్ట్రంలోనే అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల కంటే విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఎక్కువగా ఉంటుంది.
జిల్లాలో 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఇవే..
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 33 మండలాల్లో 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలున్నాయి. వీటిలో 5 వేలకు పైగా మంది విద్యార్థులు విద్య నభ్యసి స్తున్నారు. కాగా 2023-24 సంవత్సరం ప్రస్తుతం ప్రథమ సంవత్సరంలో మే 31, 2023 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది.
అడ్మిషన్లు జరుగుతున్నాయి
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. కేసీఆర్ సార్ సారథ్యంలో ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్ విద్యకు మంచి డిమాండ్ పెరిగింది. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కళాశాలల్లో ప్రథమ సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ అందిస్తున్న ఉచిత విద్య, పాఠ్యపుస్తకాలతో పాటు విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తున్నది.
–దస్రూనాయక్, డీఐఈఓ,నల్లగొండ