లహరి.. వయస్సు 12 ఏండ్లు. అందరి పిల్లల్లా అల్లరి చేస్తూ బడికి వెళ్లే ఈ పాపకు పెద్ద కష్టం వచ్చి పడింది. అది జన్యుపరమైన గుండె సమస్య. తల్లిదండ్రులది చేనేత నేపథ్యం. ఇదే జబ్బుతో పదమూడేండ్ల కింద కుమారుడిని కోల్పోయారు. ఇప్పుడు కూతురు ఆరోగ్య పరిస్థితి గమనించి ఆస్పత్రికి తీసుకెళ్తే వైద్యులు జబ్బును నిర్ధారించారు. గుండె మార్చక తప్పదని చెప్పారు. ఆపరేషన్కు ఆర్థిక పరిస్థితి సహకరించక తల్లడిల్లుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ చిన్నారికి అండగా నిలిచింది. బాధిత కుటుంబం సమస్యను ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆమె తక్షణ సాయంగా సీఎం సహాయ నిధి నుంచి 5లక్షల రూపాయల ఎల్ఓసీని మంజూరు చేయించారు. లహరికి నిమ్స్లో వైద్యం ప్రారంభమైంది. సోమవారం లండన్కు చెందిన నిష్ణాతులైన వైద్యనిపుణుల పర్యవేక్షణలో ఆపరేషన్ జరుగనున్నది. లహరికి శస్త్రచికిత్స పూర్తయ్యే వరకూ బాధ్యత తీసుకుంటామని ప్రభుత్వ విప్ సునీత తెలిపారు. గెట్ వెల్ సూన్ లహరి.
యాదగిరిగుట్ట, జూలై 22 : జన్యుపరంగా సంక్రమించిన ఇన్ఫెక్షన్తో చితికిన చిన్నారి గుండెకు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత సాయం అందించారు. నిమిషానికి 20 సార్లు మాత్రమే కొట్టుకునే చిన్ని గుండెను బతికించేందుకు అన్నీ తానై నిలిచారు. చిన్నారి అనబత్తుల లహరి గుండె మార్పునకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చూడాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి నిమ్స్ వైద్య బృందాన్ని కోరారు. లహరికి ఎంత ఖర్చైనా పర్వాలేదని, ప్రభుత్వం నుంచి అన్ని విధాలా ఆదుకుంటామని ఫోన్ ద్వారా వైద్యులకు తెలిపారు. తక్షణ వైద్య సాయం కింద సీఎంఓ కార్యాలయం నుంచి రూ. 5 లక్షల ఎల్ఓసీని మంజూరు చేశారు.
యాదగిరిగుట్ట మండలం చిన్నగౌరాయిపల్లికి చెందిన అనబత్తుల సత్యనారాయణ.. సంస్థాన్ నారాయణపూర్ మండలం పుట్టపాకకు చెందిన మేన మరుదలు సద్గుణతో 15 ఏండ్ల కిత్రం వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు, అమ్మాయి. మేనరికం కావడంతో జన్యుపర సమస్యలు తలెత్తాయి. దాంతో రెండో కుమారుడు వరుణ్కుమార్ 2010లో గుండె సంబంధిత సమస్యతో మృతి చెందాడు. కుమారుడికి వచ్చిన గుండె సమస్య కూతురు లహరికి సంక్రమించింది. 10 రోజుల క్రితం తీవ్ర అనారోగ్యం, శ్వాస సంబంధిత సమస్యలు వాటిల్లడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా, గుండె చుట్టూ ఇన్ఫెక్షన్ సోకి గుండె వాపునకు గురైందని, నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాల్సిన గుండె 20 సార్లు మాత్రమే కొట్టుకుంటుందని గుర్తించారు. వెంటనే చిన్నారికి గుండె మార్పిడి చేయాల్సిందేనని వైద్యులు ధ్రువీకరించారు.
దాంతో రఘునాథపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు పల్లె సంతోష్తో కలిసి చిన్నారి కుటుంబ సభ్యులు శుక్రవారం యాదగిరిగుట్టలో ప్రభుత్వ విప్ను కలిసి సమస్యను విన్నవించారు. నిమ్స్లో గుండె శస్త్రచికిత్స వైద్య నిపుణుడు డాక్టర్ అమరేశ్వర్రావుకు ఫోన్లో సమస్యను విన్నవించి రిపోర్ట్లు వాట్సాప్ చేశారు. రిపోర్ట్ను పరిశీలించిన వైద్యుడు చిన్నారిని నిమ్స్లో చేర్పించాలని సూచించారు. దాంతో చిన్నారి శనివారం ఉదయం నిమ్స్కు తీసుకెళ్లారు. లహరిని పరిశీలించిన అమరేశ్వర్రావు తక్షణ వైద్య ఖర్చుల నిమిత్తం రూ.5 లక్షలు ఖర్చవుతాయని ప్రభుత్వ విప్కు తెలిపారు. స్పందించిన ప్రభుత్వ విప్ శనివారం మధ్యాహ్నం సీఎంఓ దృష్టికి తీసుకెళ్లి వెంటనే ఎల్ఓసీని మంజూరు చేయాలని కోరారు. సాయంత్రం 3 గంటలకు రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు సీఎంఓ అధికారులు నిమ్స్కు ఫోన్ ద్వారా తెలిపారు. వెంటనే డాక్టర్ అమరేశ్వర్రావు లహరికి వైద్యం ప్రారంభించారు. సోమవారం లండన్కు చెందిన గుండె వైద్య నిపుణులు నిమ్స్కు రానున్నట్లు, లహరికి వారి పర్యవేక్షణలో చికిత్స, వైద్యం చేపడుతామని అమరేశ్వర్రావు తెలిపారు. అవసరమైతే చిన్నారిని లండన్కు తీసుకెళ్లి గుండె మార్పిడి చేస్తామని ప్రభుత్వ విప్కు తెలిపారు.