భువనగిరి కలెక్టరేట్, మార్చి 20 : నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న ఆశ కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారికి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వ మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశ కార్యకర్తల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆమె మాట్లాడారు. గత ప్రభుత్వం మాదిరిగానే ప్రతినెలా ఒకటిన వేతనాలను అందించాలన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా ఆశలకు ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలు చెల్లించాలన్నారు. చనిపోయిన ఆశల కుటుంబాలకు తక్షణ సహాయం రూ.50 వేలు అందించి, కుటుంబంలో అర్హత కలిగిన వారికి ఉద్యోగం కల్పించాలన్నారు. ఆశలకు వారానికి ఒక రోజు సెలవు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆశలకు వర్తించేలా సమగ్ర చర్యలు చేపట్టాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్ టంఛన్గా ఒకటిన ఆశల ఖాతాల్లో గౌరవ వేతనం రూ.9,900 జమ చేసేవారని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఆశల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. ఆశల సమస్యల పరిష్కారం కోసం ప్రస్తుత బడ్జెట్లో సముచిత స్థానం కల్పించాలన్నారు. అర్హత కలిగిన ఆశలకు ఏఎన్ఎం, జీఎన్ఎం పోస్టుల్లో మొదటి ప్రాధాన్యత కల్పించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యక్రమాల్లో ఆశ కార్యకర్తలకు అదనపు పారితోషికం ఇవ్వాలన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కార్యాలయ అధికారులకు అందజేశారు. తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తల(ఆశ) సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్.సంతోష ఆధ్వర్యంలో ఆశ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
నీలగిరి, మార్చి 20: సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఆశవరర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఆశవరర్లు శుక్రవారం మండుటెండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. నిరసన ప్రదర్శన చేస్తూ ఇందిరా భవన్కు చేరుకున్నారు. నినాదాలు చేస్తూ ఇందిరా భవన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో గేట్ ఎదుట బైఠాయించారు. ‘కనీస వేతనం ఇవ్వాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళన విరమించాలని పోలీసులు నచ్చజెప్పినా వినకుండా మండుటెండలోనే ఆందోళన చేశారు. సమస్యలపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని గడియారం సెంటర్ వద్ద బైఠాయించారు. సుమారు గంటన్నరకుపైగా ఆందోళన చేయడంతో ప్రభుత్వం తరఫున ఇన్చార్జి అదనపు కలెక్టర్ అశోక్రెడ్డి అక్కడకు చెరుకుని మాట్లాడుతూ ఆశల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. డిమాండ్లు అన్ని ప్రభుత్వానికి లేఖలో వివరిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆశ వర్కర్లు ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ సలీం మాట్లాడుతూ ఆశవరర్లకు రూ.18 వేల వేతనం అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ నాయకులు దండంపల్లి సత్తయ్య జిల్లా ఉపాధ్యక్షుడు లకపాక రాజు, పింజర్ల సైదులు, ఆదిమల్ల సుధీర్, ఆశ కార్యకర్తల జిల్లా అధ్యక్షురాలు మహేశ్వరి, కార్యదర్శి తవిటి వెంకటమ్మ, జిల్లా కమిటీ సభ్యులు ఏదుళ్ల సునీత, సీహెచ్ అనురాధ, ఆశవరర్స్ యూనియన్ నాయకులు సైదమ్మ, రేణుక, నవనీత, కవిత, శైలు తదితరులు పాల్గొన్నారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రుల క్యాంపు కార్యాలయాల ముట్టడిని భగ్నం చేయడానికి పోలీసులు శుక్రవారం ఉదయం తెల్లవారుజామున ఆశ వర్కర్లను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య తెలిపారు. జిల్లాలో 400 మందిని ముందస్తు అరెస్టు చేసి 22 పోలీసుస్టేషన్లకు తరలించారని చెప్పారు. ఇది దుర్మార్గమైన చర్య అన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన రాక్షస పాలనగా మారిందన్నారు.